- నేను పార్టీ మారితే బీఆర్ఎస్ కు భయమెందుకు?
- పసునూరి, ఆరూరి మారితే లేని అభ్యంతరం నాకే ఎందుకు?
- నా రాజకీయ జీవితంలో నాపై ఒక్క అవినీతి మరక లేదు
- కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది
- బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని పోతాను
- కార్యకర్తలు, అనుచరుల సమావేశంలో కడియం శ్రీహరి
హైదరాబాద్: తాను పార్టీ మారితే బీఆర్ఎస్ కు భయమెందుకని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అనుచరులతో ఆయన సమావేశమై.. పార్టీ మార్పుపై వారి అభిప్రాయాలను సేకరించారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలోనే ఎందుకన్నారు. తన రాజకీయ జీవితంలో తనపై ఒక్క అవినీతి మరక లేదని, ఒక్క పిట్టీ కేసు కూడా నమోదు కాలేదని కడియం చెప్పారు.
కాంగ్రెస్ నేతలే నా వద్దకు వచ్చి పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెప్పారు. తన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ ఉద్యమకారులకు ఏమీ చేయలేదని, ఒక్క రోజు కూడా దగ్గరికి రానివ్వలేదని పలువురు కార్యకర్తలు ఈ సందర్బంగా తెలిపారు. తన కోసం పదవులు పణంగా పెట్టి వస్తున్న ఎంపీటీసీలు జడ్పిటిసిలు ఎంపీపీలు అందర్నీ కాపాడుకుంటానని కడియం శ్రీహరి చెప్పారు. పాత కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తలు అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు.