- చిన్న చేపను చూపెట్టి తిమింగలాన్ని కాపాడుతున్నరు: కవిత
- రూ.25 వేల కోట్ల కాంట్రాక్ట్ను తన్నుకుపోయే ప్లాన్ వేస్తున్నరు..
- మేఘా కృష్ణా రెడ్డి గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
- బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్కు టెండర్ ఇవ్వలేదని కేటీఆర్ అనడం దారుణం
- భట్టిపై ఒక పేపర్లో వార్తరాగానే గుంటనక్క ప్రెస్మీట్ పెట్టిండు
- ఆయనను కేటీఆర్ గుడ్డిగా ఫాలో అయ్యి గుంటలో పడ్డడు
- సింగరేణిలో గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే ఈ పంచాయితీ
- రాష్ట్రంలో కాంగ్రెస్ లూజింగ్ పార్టీ అని కామెంట్
హైదరాబాద్, వెలుగు: నైనీ కోల్బ్లాక్టెండర్ను ‘మేఘా’ సంస్థకు అప్పజెప్పే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. రెండేండ్లుగా సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగానీ, అటు బీఆర్ఎస్గానీ మాట్లాడలేదని మండిపడ్డారు. ఒక తిమింగలంలాంటి కాంట్రాక్టర్కు అన్యాయం జరిగితే మాత్రం ముందుకు వస్తున్నారని విమర్శించారు.చిన్నచేపను పెద్దగా చూపించి.. పెద్ద చేపను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సుజన్రెడ్డి అనే వ్యక్తికి వచ్చింది కేవలం రూ. 250 కోట్ల కాంట్రాక్ట్ మాత్రమేనని, సీఎం బావమరిది అని ఆయనను పెద్దగా చేసి చూపెడుతున్నారని వ్యాఖ్యానించారు. కానీ, వెనక నుంచి రూ.25 వేల కోట్ల కాంట్రాక్ట్ తన్నుకుపోయేందుకు సిద్ధంగా ఉన్న మేఘా కృష్ణారెడ్డి గురించి మాత్రం మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. అసలు సుజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చిందే గుంటనక్క అని, అప్పుడు సీఎం బావమరిది అని వీళ్లకు తెలియదా? అని ప్రశ్నించారు. సాయిల్ ఎక్స్కవేషన్ పేరుతో మేఘా కృష్ణారెడ్డి సంస్థకు అనుభవం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రూ. 25 వేల కోట్ల కాంట్రాక్ట్ను పెద్ద చేపకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గ్రేడ్ 9 క్వాలిటీ ఉన్న కోల్ను పెద్ద చేప కోసం కాంట్రాక్ట్ ఇస్తున్నారన్నారు. ఆదివారం తెలంగాణ జాగృతి ఆఫీసులో కవిత మీడియాతో మాట్లాడారు. 2015లో నైనీ కోల్ బ్లాక్ సింగరేణికి రాగా.. 2021లో అదానీ 44 శాతం ఎక్సెస్గా టెండర్ వేస్తే ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వలేదని, మధ్యలో సింగరేణి వేరే కంపెనీ వాళ్లకు మట్టి తీసే టెండర్ ఇచ్చిందని, దానికి డీజిల్ ఖర్చులతో సహా ఇచ్చారని చెప్పారు. కానీ, గుంటనక్క పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఈ విషయంలో కేటీఆర్ మాట్లాడుతుంటే దారుణం అనిపించిందని అన్నారు. ఎక్సెస్ టెండర్లే ఇవ్వలేదంటూ కేటీఆర్ అబద్ధం చెప్పారని, 36, 16, 7, 8 శాతం చొప్పున ఎక్సెస్కు ఇచ్చారని పేర్కొన్నారు. ‘సైట్ విజిట్’ అనే నిబంధన సింగరేణిలో గతంలో కన్వేయర్ బెల్ట్లాంటి వాటికి ఉండేదని, ఇప్పుడు దానిని ఓబీకి కూడా పెట్టేశారని విమర్శించారు.
మహిళలపై కేటీఆర్ వైఖరి ఇదేనా?
యూట్యూబ్లలో వేసినట్టే ప్రధాన చానళ్లలోనూ ఆడబిడ్డలపై అసభ్య కథనాలు వేస్తున్నారని, దళిత ఆడబిడ్డల మీద అలాంటి కథనాలు వేయడం బాధించిందని కవిత పేర్కొన్నారు. గతంలో గీత దాటిన యూట్యూబ్ చానళ్ల ప్రతినిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి లైన్ అతిక్రమించిన శాటిలైట్ చానల్ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసిందని అన్నారు. జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరును ఖండిస్తున్నామని చెప్పారు. వాళ్లేమీ టెర్రరిస్టులు కాదని, వాళ్లకు నోటీసులు ఇచ్చి వివరణ అడగాల్సిందని అన్నారు. ఈ అవకాశంతో జర్నలిస్టులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందన్నారు. అదే సమయంలో గతంలో కేటీఆర్ మీద ఇలాంటి కథనాలే వస్తే.. ఆయన అనుచరులు ఒక టీవీ చానల్పై దాడి చేశారని గుర్తు చేశారు. అక్కడ మహిళపై కథనాలు వేస్తే దాడి చేశారని, ఇక్కడ మాత్రం జర్నలిస్టులకు ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. మహిళలపై కేటీఆర్వైఖరి ఇదేనా? అని నిలదీశారు. దళిత బిడ్డపై కథనాలు వస్తే ఆమెకు అండగా నిలబడలేదన్నారు. ఇక ఆ చానల్లో కథనం తర్వాత.. దాని బ్యాక్గ్రౌండ్ అంటూ ఇంకొక పేపర్లో స్టోరీ వచ్చిందని, దాని ఆధారంగా భట్టి విక్రమార్క ప్రెస్మీట్పెడితే.. ఆ వెంటనే గుంటనక్క కూడా ప్రెస్మీట్ పెట్టారని చెప్పారు. ఆ గుంట నక్క ప్రెస్ మీట్ను గుడ్డిగా ఫాలో అయిన కేటీఆర్.. మరో ప్రెస్ మీట్పెట్టారన్నారు. కాగా, దళితులను అవమానించేలా భట్టి విక్రమార్కకు లేఖ రాయను అంటూ వ్యాఖ్యానించారని, అదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మాత్రం లేఖ రాస్తారా? అని నిలదీశారు.
గుంటనక్క వాటాలు తేలలేదనే..
సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారని, కానీ, అసలు గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే అలా మాట్లాడుతున్నారని కవిత విమర్శించారు. ఇదే విషయంపై విచారణ చేయాలంటూ 2014 నుంచి ఆయన అడుగుతున్నారన్నారు. ఈ లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే విచారణ చేయమంటున్నారని చురకలంటించారు. కేటీఆర్ కూడా అదే ట్రాప్లో పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ లోనే ఉంటూ కేసీఆర్కు గుంటనక్క ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను కేటీఆర్ గుడ్డిగా ఫాలో అయి గుంటలో పడ్డాడని అన్నారు. ఏ చానల్ బ్యాన్ చేసినా.. త్వరలోనే ప్రజలు బీఆర్ఎస్ను బ్యాన్ చేస్తారని చెప్పారు. తాను కాంగ్రెస్లోకి వస్తానంటే వద్దన్నానని మహేశ్ కుమార్ గౌడ్ చెబుతున్నారని, అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే లూజర్ పార్టీ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది జాగృతి పార్టీనేనని చెప్పారు. ధూంధాంగా పార్టీని లాంచ్ చేస్తామని వెల్లడించారు. అందులో మహేశ్ కుమార్గౌడ్ ఎక్స్పీరియన్స్కు తగ్గట్టుగా నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిపోయిందని, రెండేండ్లుగా సీరియల్లాగా సాగదీస్తున్నారని అన్నారు. తనలాంటి బాధితులకు మేలు చేయడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి నోటీసులు ఇస్తున్నారా? బాధితులకు ఇస్తున్నారా? అని నిలదీశారు.
ఎండీవోతో సింగరేణికి నష్టం
సింగరేణిలో మైన్ డెవలపర్ అండ్ అపరేటర్ (ఎండీవో) అనే సిస్టమ్ తీసుకురావడం వల్ల సంస్థకు ఎంతో నష్టం వస్తున్నదని కవిత చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణికి రూ.25 వేల కోట్ల అప్పు పెట్టారని, కాంగ్రెస్ వచ్చాక రూ. 50 వేల కోట్లకు పెరిగిందని ఆరోపించారు. పవర్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని అన్నారు. దీంతో సింగరేణి సంస్థ జీతాల కోసం కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. నైనీ టెండర్లలాగా ఎండీవో విధానాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నైనీని కూడా ఓపెన్ కాస్ట్ చేయాలని, తద్వారా తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు వస్తాయని, సంస్థకు మేలు జరుగుతుందని చెప్పారు.
