
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లక్డీకాపూల్లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య విగ్రహాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. రోశయ్య 92వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు, హైదరాబాద్ మేయర్, ఆర్యవైశ్య సంఘాల నేతలు, రోశయ్య కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ సమీపంలో 9 అడుగుల ఎత్తయిన రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోశయ్య 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎంగా రాజీనామా చేశాక తమిళనాడు గవర్నర్గా సేవలందించారు. ప్రతి ఏటా జులై 4న రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.