నేరేడ్మెట్లో మహిళ అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ భర్త, అత్త అరెస్ట్
నేరేడ్మెట్, వెలుగు: ఐదు రోజుల క్రితం నేరేడ్ మెట్ లో మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అదనపుకట్నం కోసం, అనుమానంతో వేధించిన భర్త.. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తేల్చారు. నిందితుడితో పాటు అతడి తల్లిని అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్లోని జేజేనగర్లో ఉండే పటోళ్ల బసవ లింగప్ప(36)కు సంగారెడ్డి జిల్లాకి చెందిన సిద్ధేశ్వర కూతురు అనిత(29)తో 2018 ఆగస్టులో పెళ్లైంది. వీరికి 8 నెలల పాప ఉంది. బసవలింగప్ప నేరేడ్మెట్లోని ఎన్.ఎఫ్.సి డిస్పెన్సరీలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా రూ.2 లక్షలు అదనపు కట్నం కావాలంటూ అనితను భర్త బసవలింగప్ప, అత్త పరమ్మ, మరిది నవీన్ కుమార్ వేధిస్తున్నారు. అనితపై అనుమానంతో బసవలింగప్ప డైలీ డ్యూటీకి వెళ్లే ముందు ఆమెను ఇంట్లోనే ఉంచి తాళం వేసి పోయేవాడు. పెద్దల సమక్షంలో బసవలింగప్పకు ఎన్నోసార్లు నచ్చజెప్పించినా అతడి తీరు మారలేదు. ఈ నెల 14న సిద్ధేశ్వరకు కాల్ చేసిన జేజేనగర్ కాలనీ వాసులు అనిత చనిపోయినట్లు చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిద్ధేశ్వర కూతురు డెడ్ బాడీని చూసి మెడపై గాయాలున్నట్లు గుర్తించాడు. బసవలింగమే తన కూతురిని చంపి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నాడంటూ సిద్ధేశ్వర పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనిత డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. అనితది ఆత్మహత్య కాదు..హత్యే అని పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో పోలీసులు బసవలింగప్పతో పాటు అతడి తల్లి పరమ్మను అదుపులోకి తీసుకుని విచారించారు. తానే గొంతు నులిమి అనితను హత్య చేసినట్లు బసవలింగప్ప ఒప్పుకున్నాడు. నిందితుడితో పాటు హత్యకు సహకరించిన అతడి తల్లి పరమ్మను పోలీసులు రిమాండ్ కి తరలించారు. పరారీలో ఉన్న అనిత మరిది నవీన్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.