
హైదరాబాద్, వెలుగు: క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసి దేశ సమగ్రత, సమైక్యతను కాపాడాలని సెంటర్ గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన యువతకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హకీంపేట్లోని సీఐఎస్ఎఫ్ ఆడిటోరియంలో జరిగిన 8వ రోజ్గార్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఉద్యోగాలు పొందిన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీలో ఉద్యోగాలు పొందిన 323 మంది నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. యువత సామర్థ్యాన్ని దేశం కోసం సద్వినియోగం చేసుకోవాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని అన్నారు. ఇందుకోసం అవసరమైన నైపుణ్యాన్ని కల్పించడంతో పాటు, వారికి సరైన అవకాశాలు కల్పించాలనే మోదీ కోరుకుంటారని తెలిపారు. దీనికి తగ్గట్లుగానే 9 ఏండ్లుగా.. ఒక్కో వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు.