
- 600 మంది రైతుల వివరాలు అన్లైన్లో నమోదు
- నేడు రాష్ర్ట అవతరణ వేడుకల్లో రైతులకు సర్టిఫికెట్ల అందజేత
కామారెడ్డి, లింగంపేట, వెలుగు : ఏండ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ‘భూభారతి’ పథకాన్ని తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్ట్గా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేయగా, జిల్లాలోని లింగంపేట మండలం ఎంపిక కావడం రైతులకు వరంగా మారింది. రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు. 23 రెవెన్యూ గ్రామాల పరిధిలో భూ సమస్యలపై 4,225 అప్లికేషన్లు వచ్చాయి.
9 స్పెషల్ టీమ్స్ క్షేత్రస్థాయిలో పరిశీలించి 978 అప్లికేషన్లను పరిష్కరించారు. ఇందులో 600 మంది వివరాలను అన్లైన్లో నమోదు చేశారు. సమస్యలు పరిష్కరించిన రైతుల్లో నుంచి కొందరిని సెలక్ట్ చేసి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే రాష్ర్ట అవతరణ దినోత్సవంలో సర్టిఫికెట్లను అందజేయనున్నారు. తహసీల్దార్, కలెక్టరేట్ చుట్టూ కొన్నేండ్లుగా తిరిగినా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు ‘భూభారతి’ ద్వారా క్లియర్ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన సమస్యలు
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాస్బుక్స్లో పేర్లు తప్పు పడటం, భూమి తక్కువ చూపటం, సర్వే నంబర్ల తప్పు, ఫారెస్ట్, రెవెన్యూ భూమి సరిహద్దు వివాదాలు, అసైన్డ్భూమిని తరాలుగా సాగు చేసుకుంటున్నప్పటికీ పాస్బుక్స్ లేకపొవటం వంటి సమస్యలతో రైతులు సతమతమయ్యారు. రైతు భరోసా రాక, బ్యాంక్ రుణాలు తీసుకోలేక, క్రయవిక్రయాలు జరుగక అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడారు.
పరిష్కారమైనవి ఇలా..
325 కొత్త పాస్బుక్స్ జారీ చేశారు. పట్టాదారు పాస్బుక్స్లో పేర్ల తప్పులు సరిదిద్దటం, మార్పులు, చేర్పులు, సర్వే నంబర్ తప్పులను సవరించటం వంటి 283, సమస్యలు పరిష్కరించారు. అసైన్డ్పట్టాలకు వారసత్వ హక్కులు, కొనుగోలు చేసి అర్హులై ఉన్న వారి పేరిట పట్టా మార్పు.. 192, అసైన్డ్భూమి సాగు చేసుకుంటున్న రైతులకు కొత్తగా పాస్బుక్స్ జారీ.. 74, సాదాబైనామాలు 45, ఫారెస్ట్, రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం 35, ఇతర సమస్యలు 25 ఉన్నాయి.
అసైన్డ్, ఫారెస్ట్ భూముల ఆమోదం కోసం..
అసైన్డ్ భూములకు కొత్త పాస్బుక్స్ జారీ, కొనుగోలు చేసి, అర్హులైన వారి పేరిట అసైన్డ్పట్టా మార్చటం, ఫారెస్ట్, రెవెన్యూ సమస్యలకు సంబంధించి కొన్ని అప్లికేషన్లనూ క్లియర్ చేస్తున్నప్పటికీ ఫైనల్ ఆమోదానికి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. క్లియరెన్స్ ఇస్తే సమస్యలు పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కానున్నాయని అధికారులు తెలిపారు.
రికార్డుల్లో ఎంట్రీ అయ్యింది..
ధరణి ఆన్లైన్లో భూమి ఎంట్రీ కాలేదు. పాస్బుక్లో పూర్తి వివరాలు రాలేదు. సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం వస్తలేదు. ‘భూభారతి’లో దరఖాస్తు ఇచ్చినా. సమస్య పరిష్కారమైందని అధికారులు తెలుపడంతో సంతోషంగా ఉంది.
చిట్లిమిల్లి అంజయ్య, శెట్పల్లి సంగారెడ్డి