భూభారతితో సమస్యలకు చెక్​ .. పైలట్ మండలం లింగంపేటలో 978 అప్లికేషన్లు క్లియర్​

భూభారతితో సమస్యలకు చెక్​ .. పైలట్ మండలం లింగంపేటలో 978 అప్లికేషన్లు క్లియర్​
  • 600 మంది రైతుల వివరాలు అన్​లైన్​లో నమోదు 
  • నేడు రాష్ర్ట అవతరణ వేడుకల్లో రైతులకు సర్టిఫికెట్ల అందజేత

 కామారెడ్డి, లింగంపేట, వెలుగు : ఏండ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు చెక్​ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ‘భూభారతి’ పథకాన్ని తీసుకొచ్చింది. పైలట్​ ప్రాజెక్ట్​గా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేయగా, జిల్లాలోని  లింగంపేట మండలం ఎంపిక కావడం రైతులకు వరంగా మారింది. రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు.  23 రెవెన్యూ గ్రామాల పరిధిలో భూ సమస్యలపై 4,225 అప్లికేషన్లు వచ్చాయి.  

9 స్పెషల్ టీమ్స్ క్షేత్రస్థాయిలో పరిశీలించి 978 అప్లికేషన్లను పరిష్కరించారు.   ఇందులో 600 మంది వివరాలను అన్​లైన్​లో నమోదు చేశారు.  సమస్యలు పరిష్కరించిన రైతుల్లో నుంచి కొందరిని సెలక్ట్​ చేసి   సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే రాష్ర్ట అవతరణ దినోత్సవంలో సర్టిఫికెట్లను అందజేయనున్నారు. తహసీల్దార్​, కలెక్టరేట్​ చుట్టూ కొన్నేండ్లుగా తిరిగినా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు ‘భూభారతి’ ద్వారా క్లియర్​ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

ప్రధాన సమస్యలు 

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  పాస్​బుక్స్​లో  పేర్లు తప్పు పడటం, భూమి  తక్కువ చూపటం,  సర్వే నంబర్ల తప్పు,  ఫారెస్ట్, రెవెన్యూ భూమి సరిహద్దు వివాదాలు, అసైన్డ్​భూమిని తరాలుగా సాగు  చేసుకుంటున్నప్పటికీ పాస్​బుక్స్​ లేకపొవటం వంటి సమస్యలతో రైతులు సతమతమయ్యారు.  రైతు భరోసా రాక, బ్యాంక్​  రుణాలు తీసుకోలేక,  క్రయవిక్రయాలు జరుగక అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడారు.   

పరిష్కారమైనవి ఇలా.. 

325 కొత్త పాస్​బుక్స్​ జారీ చేశారు. పట్టాదారు పాస్​బుక్స్​లో  పేర్ల తప్పులు సరిదిద్దటం, మార్పులు, చేర్పులు, సర్వే నంబర్​ తప్పులను సవరించటం వంటి 283,   సమస్యలు పరిష్కరించారు. అసైన్డ్​పట్టాలకు వారసత్వ హక్కులు,  కొనుగోలు చేసి అర్హులై ఉన్న వారి పేరిట పట్టా మార్పు..  192, అసైన్డ్​భూమి సాగు చేసుకుంటున్న రైతులకు కొత్తగా పాస్​బుక్స్​ జారీ.. 74,  సాదాబైనామాలు 45, ఫారెస్ట్, రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం 35,  ఇతర సమస్యలు 25 ఉన్నాయి.

అసైన్డ్​, ఫారెస్ట్​ భూముల ఆమోదం కోసం..

అసైన్డ్ భూములకు కొత్త పాస్​బుక్స్ జారీ, కొనుగోలు చేసి, అర్హులైన వారి పేరిట అసైన్డ్​పట్టా మార్చటం, ఫారెస్ట్, రెవెన్యూ సమస్యలకు సంబంధించి కొన్ని  అప్లికేషన్లనూ క్లియర్ చేస్తున్నప్పటికీ ఫైనల్ ఆమోదానికి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. క్లియరెన్స్​ ఇస్తే సమస్యలు పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కానున్నాయని అధికారులు తెలిపారు.  

రికార్డుల్లో  ఎంట్రీ అయ్యింది..

 ధరణి ఆన్​లైన్​లో భూమి  ఎంట్రీ కాలేదు. పాస్​బుక్​లో పూర్తి వివరాలు రాలేదు.  సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.  ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం వస్తలేదు. ‘భూభారతి’లో దరఖాస్తు ఇచ్చినా. సమస్య పరిష్కారమైందని అధికారులు తెలుపడంతో సంతోషంగా ఉంది.

‌చిట్లిమిల్లి అంజయ్య, శెట్పల్లి సంగారెడ్డి