
ఈ ఏడాది జనవరి గుడ్ నోట్ తోనే మొదలైనా.. ఆ తర్వాత సెకండ్ వేవ్ కరోనా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఒకదశలో దేశం షేక్ అయింది. మళ్లీ లాక్ డౌన్లు పడుతాయని ఎవరూ ఊహించలేదు. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు, నిండిపోయిన హాస్పిటళ్లు, ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది దేశంలో కరోనాకు సంబంధించి ఏమేం జరిగాయన్నది చూద్దాం.
కరోనా విషయంలో 2021 ఒక పీడకలలా మిగిలిపోయింది. దేశంలో గతంలో ఎన్నడూ తలెత్తనంతగా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి పడింది. కరోనా వాయు వేగంతో ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అయింది. దీంతో ఎన్నెన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జనవరి, ఫిబ్రవరిలో చాలా అత్యల్పంగా కేసులు వచ్చాయి. ఫస్ట్ వేవ్ లో కేసులు తక్కువున్నా.. ఎక్కువ కాలం లాక్ డౌన్ కొనసాగింది. దీంతో 2020 ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ఎఫెక్ట్ చూపగా.. 2021 అంతకంటే ఎక్కువ చుక్కలు చూపింది.
ఫస్ట్ వేవ్ నుంచి దేశం ఈ ఏడాది ఆరంభంలో బాగానే కోలుకుంది. జనవరి, ఫిబ్రవరిలో కేవలం 9 వేల లోపు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో పరిస్థితి అంతా బాగుందనుకున్న టైంలో పిడుగులాగా సెకండ్ వేవ్ వచ్చి పడింది. దీంతో దేశం రెండు మూడు నెలలు అసలు కోలుకోలేకపోయింది. ఫస్ట్ వేవ్ తర్వాత జనం జాగ్రత్తలు తీసుకోలేదు. మాస్కులు, డిస్టెన్స్ పక్కన పెట్టేశారు. అప్పటికి వ్యాక్సినేషన్ పెద్దగా జరగకపోవడం, డెల్టా వేరియంట్ రావడంతో కరోనా చాలా వేగంగా వ్యాపించింది.
దేశంలో ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ మొదలైంది. దేశీయంగా కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇవ్వడంతో వీటిని జనానికి ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే మొదట్లో తక్కువ ప్రొడక్షన్ ఉండడంతో విడతల వారీగా ఏర్పాట్లు చేశారు. మొదట ఫ్రంట్ లైన్ సిబ్బందికి అంటే హెల్త్, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి ఇచ్చారు. ఆ తర్వాత వృద్ధులకు ఇచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి అవకాశం కల్పించారు. చివరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్రం సూచించింది. మొదట్లో వ్యాక్సిన్లు తగినంత లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ ప్రొడక్షన్ బూస్టప్ పెరగడం, స్పుత్నిక్ వీ వంటి టీకాలూ అందుబాటులోకి రావడంతో వ్యాక్సిన్ కొరత తీరిపోయింది.
ఈ ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్లపై జనంలో చాలా అనుమానాలు కలిగాయి. అసలు తీసుకోవచ్చా లేదా అన్న డౌట్ తో ఉండిపోయారు. తీసుకుంటే సైడ్ ఎఫెక్టులు ఎక్కువుంటాయని, సమస్యలేమైనా వస్తాయన్న భయంతో చాలా మంది అలాగే ఉండిపోయారు. అంతగా డిమాండ్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా చుట్టుపక్కల మిత్ర దేశాలకు టీకాలను సప్లై చేసింది. అయితే సెకండ్ వేవ్ చూపించిన ఎఫెక్ట్ తో చాలా మంది టీకాలు తీసుకుంటేనే కరోనాకు చెక్ పెట్టవచ్చన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగింది. వెంటనే ఎగుమతి ఆపేసి లోకల్ గా ఇవ్వడం మొదలు పెట్టారు.
2020లో ఫస్ట్ వేవ్ దేశమంతా వ్యాపించినా లక్ష్యద్వీప్ లో మాత్రం ఈ ఏడాది జనవరి 19న తొలి కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో మొత్తం కోటీ 20 లక్షల మందికి కరోనా సోకింది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడ్డ వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్ తొలి వారం నుంచి కరోనా కేసులు క్రమంగా పెరగడం మొదలైంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నట్లుండి కరోనా వ్యాప్తి పెరిగింది. డెల్టా వేరియంట్ అని గుర్తించలేకపోయారు. అప్పటికే జరగాల్సిన భారీ నష్టం జరిగిపోయింది. మహారాష్ట్రలో రోజుకు 10 వేలు, 20 వేలు, 30 వేలు, 40 వేలు అలా కేసులు బీభత్సంగా పెరిగిపోయాయి. దీంతో ఏప్రిల్ తొలి వారం నుంచే మాల్స్ సహా ఇతర రద్దీ ప్రాంతాలను మూసేసి రిస్ట్రిక్షన్స్ పెంచారు.
ఏప్రిల్ 7వ తేదీన ఒక్కరోజే దేశంలో కరోనా కేసులు లక్షా 3 వేలుగా నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 57 వేల కేసులు వచ్చాయి. ఓవరాల్ గా కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటడంతో దేశంలో అలర్ట్ మొదలైంది. ఓవైపు వ్యాక్సినేషన్ లిమిటెడ్ గా ఉండడం, వర్క్ ఫోర్స్ యువతకు కూడా టీకాలు ఇవ్వాలన్న ఒత్తిడి పెరిగినా ప్రొడక్షన్ లేక వెంటనే ఇవ్వలేకపోయారు. లక్షా 25 వేల కేసులు అలా రోజురోజుకూ తీవ్రత పెరిగిపోయింది. అది కాస్తా సెకండ్ వేవ్ కు దారి తీసింది.
ఏప్రిల్ రెండో వారం నాటికి దేశంలో రోజుకు లక్షా 50 వేలకు పైనే కరోనా కేసులు రావడం మొదలైంది. ఆలస్యంగా రియాక్ట్ అయిన మహారాష్ట్ర సర్కారు అప్పుడు వీకెండ్ లాక్ డౌన్ పెట్టడం మొదలు పెట్టింది. ఏప్రిల్ లో ఆక్సిజన్ కు, యాంటీవైరల్ డ్రగ్ అయిన రెమ్ డెసివిర్ కు చాలా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఏప్రిల్ 11న రెమ్ డెసివిర్ ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. ప్రపంచవ్యాప్తంగా అప్పటికి కరోనా కేసుల్లో అమెరికా, బ్రెజిల్ టాప్ టూ పొజిషన్ లో ఉన్నాయి. అయితే భారత్ బ్రెజిల్ ను దాటేసి రెండో స్థానానికి వెళ్లింది. ఏప్రిల్ 14 నాటికి దేశంలో రోజుకు 2 లక్షల వరకు కేసులు రావడం మొదలైంది. అది మొదలు దేశంలో అలజడి కొనసాగింది. దేశంలో ఎక్కడ చూసినా హాస్పిటల్స్ నిండిపోయాయి. బెడ్స్ దొరకలేదు. వీటికి తోడు ఆక్సిజన్ చాలా అవసరం పడింది. ఏ హాస్పిటల్ చూసినా మెడికల్ ఆక్సిజన్ లేక పేషెంట్లు పిట్టల్లా రాలిపోయారు. చాలా హృదయవిదారక ఘటనలు జరిగాయి.
ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 30, 40 శాతాలుగా రికార్డ్ అయ్యాయి. హోటల్స్, ఇతర ప్రాంతాల్లో హాస్పిటల్ బెడ్స్ అరేంజ్ చేశారు. సెకండ్ వేవ్ తో భారత్ అల్లాడిపోయిన దశలో అమెరికా సహా చాలా దేశాలు తమ వంతు సహాయం అందించాయి. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, యాంటీ వైరల్ డ్రగ్స్, టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు వంటి ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ విమానాల్లో పంపి సహాయం చేశాయి. సహాయం కావాలంటూ సోషల్ మీడియా సైట్లలో పోస్టులు వెల్లువెత్తాయి. ఏప్రిల్ చివరి నాటికి రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షల 86 వేల దాకా వెళ్లాయి.
మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పటికే టీకాల కొరత చాలా వరకు ఏర్పడింది. కొన్ని రాష్ట్రాలైతే గ్లోబల్ టెండర్లకు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. ఇంకోవైపు టీకాల పంపిణీపై కేంద్రం, రాష్ట్రాల మధ్య గ్యాప్ వచ్చింది. చివరకు కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ముందుకు రావడంతో ఆ ఇష్యూకు బ్రేక్ పడింది. మే 7న దేశంలో 4 లక్షల 14 వేల కేసులు ఒక్కరోజే నమోదయ్యాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక్కరోజులో అన్ని కేసులు నమోదవలేదు. దీంతో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోతోందన్న విషయం అందరికీ అర్థమైంది. వరుసగా నాలుగు రోజుల పాటు నాలుగు లక్షలకు పైగా రోజువారీ కేసులు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలన్న వాదనలు పెరిగాయి. దీంతో అన్ని చోట్లా కఠిన లాక్ డౌన్లు పెట్టడంతో కేసులు దిగి వచ్చాయి. మే చివరి నాటికి రోజువారీ కేసులు లక్షా 65 వేలుగా ఉన్నాయి. ఆ తర్వాత కేసులు నెమ్మదించాయి. నవంబర్, డిసెంబర్ నాటికి డైలీ కేసులు ఐదారువేల లోపే వస్తున్నాయి. అయితే డిసెంబర్ లో ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. ఈ వేరియంట్ తో ఏం జరుగుతుందన్న టెన్షన్ మాత్రం ఉంది.