పటాన్ చెరులో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. పార్కు స్థలాలు, రహదారులను కబ్జా చేసి నిర్మించిన లేఔట్లను తొలగించి 92 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. 47 వేల 840 గజాల ప్రభుత్వ స్థలాలకు విముక్తి కల్పించారు అధికారులు.
గురువారం (మార్చి 26) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటిఘనాపూర్లో 92 ఎకరాల లేఔట్లో పార్కులు, రహదారుల ఆక్రమణలు తొలగించారు హైడ్రా అధికారులు. సోమవారం (మార్చి 23) ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా టీమ్.. ఆక్రమణలపై భారీ స్థాయిలో తొలగింపు చర్యలు చేపట్టారు.
►ALSO READ | మానవ అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఊరట
పాటిఘనాపూర్లో1980లో ఆనందనగర్ కాలనీ పేరుతో కొందరు లేఔట్ ఏర్పాటు చేశారు.1109 ప్లాట్లతో ఉన్న లేఔట్ను తర్వాత వ్యవసాయ భూమిగా మార్పు చేశారు. ఫేక్ పాస్బుక్స్ సృష్టించి విక్రయాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. లేఔట్ ప్రకారం పార్కులు, రహదారులు కబ్జా అయినట్లు నిర్ధారణకు వచ్చారు హైడ్రా అధికారులు.
పూర్తి సర్వే తర్వాత ప్రీకాస్ట్ బ్రిక్స్ ప్రహరీలు, షెడ్లు తొలగించారు అధికారులు. పార్క్ స్థలాల్లో హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. రహదారుల హద్దులు నిర్ధారించి పార్క్ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
