
- నత్తనడకన సాగుతున్న పనులు
- కొన్ని చోట్ల స్థలాలు అందుబాటులో లేకపోవడంతో ప్రారంభం కాని పనులు
- పెండింగ్పనులు పూర్తి చేస్తామంటున్న ఆఫీసర్లు
మహబూబాబాద్, వెలుగు:గ్రామ పరిపాలనా భవనాలు కొన్ని గ్రామాల్లో ప్రజలకు ఇంకా అందుబాటులో లేవు. జీపీలకు శాశ్వత భవనాలను నిర్మించే లక్ష్యంతో జిల్లాలో సమగ్ర గిరిజనాభివృద్ధి (ఐటీడీఏ), పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 2011–2012 నుంచి 2025 వరకు గ్రామాల్లో కొత్త గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలు చేపట్టింది. మహబూబాబాద్ జిల్లాలో మొత్తంగా 266 జీపీ భవనాలు మంజూరయ్యాయి.
ఇందులో ఇప్పటి వరకు 106 చోట్ల పనులు ప్రారంభం కాలేదు. 74 చోట్ల నిర్మాణ పనులు పూర్తి కాగా, మరో 86 చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నూతన గ్రామ పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో ప్రజలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేటాయించిన నిధులు..
ఎంజీఎన్ ఆర్ ఈజీఎస్ ద్వారా ఒక్కో జీపీ భవనానికి రూ.13 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పనులు పూర్తికాకపోవడంతో అదనంగా మరో రూ.3 లక్షలు మంజూరు చేశారు. పంచాయతీ రాజ్ ద్వారా 76 భవనాలకు సుమారు రూ.12.16 కోట్లు కేటాయించారు. ఐటీడీఏ ద్వారా జిల్లాలో 20 భవనాలు మంజూరయ్యాయి. ఒక్క భవనానికి రూ.16.85 లక్షల చొప్పున రూ.3.37 కోట్లు కేటాయించారు. కొన్ని గ్రామాల్లో జీపీ భవనాల పనులు చివరి దశకు చేరుకోగా, మరికొన్ని జీపీల్లో పిల్లర్ల దశలోనే పనులు నిలిచిపోయాయి.
నత్తనడకన సాగుతున్న పనులు..
మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామంలో నిర్మించిన పంచాయతీ భవనం రెండు గ్రామాల మధ్య ఉండడంతో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. జంగిలిగొండలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీఎస్ లక్ష్మీపురంలో పిల్లర్ల దశలోనే పనులు నిలిచిపోగా, సింగారంలో పనులు మధ్యలో నిలిచిపోవడంతో అందులో రేషన్ షాపు నడుపుతున్నారు. కురవి మండలం కాకుల బోడుతండాలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో పనులు మధ్యలో నిలిచిపోగా, బొడ్లాడలో పనులు పూర్తి కాలేదు. ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
మరిపెడ మండలం తానంచర్ల, తాళ్లఊకల్లు గ్రామాల్లో జీపీ భవన నిర్మాణ పనులు ఫినిషింగ్ దశకు చేరుకున్నాయి. నెల్లికుదురు మండలం రావిరాల, నర్సిం హులగూడెం, మదనతుర్తి, రామన్నగూడెం గ్రామాల్లో జీపీ భవన నిర్మాణ పనులుమధ్యలోనే నిలిచిపోయాయి.
జీపీ భవనాల మంజూరు వివరాలు
సంవత్సరం మంజూరైన జీపీలు కంప్లీట్ ప్రగతిదశలో ప్రారంభం కానివి
2011-12 32 29 - 3
2015_16 13 11 2 -
2016_17 76 22 28 26
2023_24 132 12 52 68
2024_25 13 - 4 9
పెండింగ్పనుల పూర్తి చేస్తాం..
జిల్లాలో నూతన జీపీ భవనాల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం. కొన్ని గ్రామాల్లో జీపీ భవనాలు మంజూరైనా అనుకూలంగా ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి. మరి కొన్నిచోట్ల పనులు ప్రగతి దశలో ఉన్నాయి. బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో కొంత మేరకు ఆలస్యం జరుగుతుంది. - పి.విద్యాసాగర్, పీఆర్ఈఈ, మహబూబాబాద్ జిల్లా