పద్మారావునగర్, వెలుగు: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. బోయిన్పల్లిలో తన దత్తపుత్రుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలపై ఆయన ఆవేశంగా సమాధానమిచ్చారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నానని, కేవలం ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అనంతరం మరేమీ మాట్లాడకుండా ఆయన అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.

