
- మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ఇరవెండి ఫారెస్ట్ బీట్ లోని కొసగుంపు వలస ఆదివాసీ గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఫారెస్ట్ భూమికి కందకాలు తవ్వేందుకు వెళ్లిన జేసీబీని కొసగుంపు వలస గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు అడ్డుకున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణపై జిల్లా అటవీ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులను బుధవారం నివేదిక కోరారు.
కందకాలు తవ్వకుండా జేసీబీకి అడ్డుగా మహిళలు బైఠాయించగా, ఫారెస్ట్ అధికారులు మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని,ఈ క్రమంలో వలస ఆదివాసీ మహిళలు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నదని వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయంలో మంత్రి సీతక్క కూడా మంత్రి సురేఖతో ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడారు. నివేదిక వచ్చిన తర్వాత తదనుగుణంగా ముందుకెళ్దామని సీతక్కకు అటవీ శాఖ మంత్రి సురేఖ తెలిపారు.