
- గతంలో రోజూ లక్షన్నర వరకు ప్రయాణం
- ఇప్పుడు 60 వేల మంది కూడా ఎక్కుతలేరు
- 120 నుంచి 88కి తగ్గినరైళ్ల సంఖ్య
- మెట్రో, మహాలక్ష్మి స్కీం ఎఫెక్ట్!
హైదరాబాద్సిటీ, వెలుగు: రాను రాను ఎంఎంటీఎస్ రైళ్లకు ప్యాసింజర్లు తగ్గుతున్నారు. టికెట్ రేట్లు నామమాత్రమే అయినా కొన్ని రూట్లలో ఆలస్యంగా వెళ్తుండడం, ఎక్స్ప్రెస్రైళ్లకు రూట్క్లియర్చేయడం కోసం ఎక్కడ ఆగుతుందో తెలియకపోవడం, ప్రధాన రూట్లలో మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడం, మహాలక్ష్మి స్కీంతో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కారణాలతో ఎంఎంటీఎస్రైళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పదేండ్ల క్రితం రోజుకు లక్షన్నర వరకు ఎంఎంటీఎస్లో ప్రయాణిస్తే ఇప్పుడు 50 నుంచి 60వేల మంది వరకు మాత్రమే జర్నీ చేస్తున్నారు.
గతమెంతో ఘనం
గ్రేటర్పరిధిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ ఖర్చుతోనే ప్రయాణించడానికి, ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి అందరికీ అందుబాటులో ఉండేలా రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మల్టీ మోడల్ట్రాన్స్పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్)ను 2003లో అందుబాటులోకి తెచ్చారు. మినిమమ్ చార్జి రూ.5 కాగా, మాగ్జిమమ్రూ.10 తీసుకుంటున్నారు. తక్కువ ధరకే నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండడంతో చాలా మంది ప్రయాణికులు ఆసక్తి చూపించారు. దీంతో ఈ రైళ్లన్నీ కిక్కిరిసిపోయి కనిపించేవి.
ఎందుకు తగ్గిందంటే..
ఎంఎంటీఎస్ ఎక్కాలంటే రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. దిగిన తర్వాత స్టేషన్ నుంచి బయటకు వచ్చి మళ్లీ బస్సు దొరకబుచ్చుకోవడం వల్ల ఆలస్యం అవుతుండడంతో ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. 2017లో నగరంలో మెట్రో రైల్ప్రారంభం కావడంతో అందరూ ఇటు వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. మెట్రో స్టేషన్లు ప్రధాన రహదారులపై ఉండడం, 69 కిలోమీటర్ల మార్గంలో 57 స్టేషన్లు ఉండడం, సగటున 1.21 కిలోమీటర్లకే ఒక స్టేషన్ఉండడం, తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు ఉండడంతో అంతా మెట్రో ఎక్కడానికి కారణమైంది.
పైగా, మెట్రో స్టేషన్ల నుంచి దిగగానే క్యాబ్ఎక్కే ఫెసిలిటీ ఉండడం, బస్టాప్లు అందుబాటులో ఉండడంతో ఈ రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. అలాగే, కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తీసుకువచ్చిన మహాలక్ష్మి స్కీంతో మెట్రోరైళ్లలో ప్రయాణికుల సంఖ్య కొంత తగ్గినా ఎంఎంటీఎస్కు మాత్రం భారీగా నష్టం కలిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడంతో అత్యధిక శాతం మంది బస్సు ప్రయాణానికే ఆసక్తి చూపిస్తున్నారు.
ఎంఎంటీఎస్ రైళ్ల తగ్గింపు.. రెండో దశకు శ్రీకారం
గ్రేటర్పరిధిలో గతంలో 120 ఎంఎంటీఎస్రైళ్లు నడిచేవని, ఇప్పుడు ఈ సంఖ్య 88కి పడిపోయిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు తగ్గుతుండడంతో అధికారులు రైళ్ల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. ఎంఎంటీఎస్తో ఆదాయం లేకపోగా నష్టాలతో నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.400 కోట్లు చెల్లించాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ రెండో దశ కొనసాగింపునకు రూ.420 కోట్లతో త్వరలో పనులు చేపట్టబోతోందని అధికారులు తెలిపారు.
ఘట్కేసర్ నుంచి వంగపల్లి (యాదాద్రి) వరకు 38 కి.మీ. ఎంఎంటీఎస్ సేవల పొడిగింపు పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఉమ్దానగర్నుంచి మేడ్చల్ (57 కి.మీ.), రామచంద్రాపురం నుంచి ఘట్కేసర్(55 కి.మీ.) నాంపల్లి నుంచి హుస్సేన్ సాగర్ వరకు (4కి.మీ.) కలిపి 116 కి.మీ. మేరకు ఎంఎంటీఎస్ సర్వీసులు కొనసాగుతున్నాయి. ఈ పరిధిలో మొత్తం 53 స్టేషన్లున్నాయి.