హుస్సేన్ సాగర్ తీరానికి కొత్త అందాలు ఛత్ పూజ, బతుకమ్మ ఘాట్ల ఆధునీకరణ

హుస్సేన్ సాగర్  తీరానికి కొత్త అందాలు ఛత్ పూజ, బతుకమ్మ ఘాట్ల ఆధునీకరణ
  • రివెట్​మెంట్ వాల్ నిర్మాణం 
  • వేల మంది కూర్చోవడానికి ఏర్పాట్లు
  • 5,424 చ. మీ మేర గోడలకు పెయింటింగ్స్ 
  • రూ.3.16 కోట్లతో హెచ్ఎండీఏ ప్రతిపాదనలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: హుస్సేన్​సాగర్​తీరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ‘సాగర్’​కు ఆనుకుని ఏర్పాటు చేసిన పీపుల్స్​ప్లాజా, నెక్లెస్​రోడ్, లుంబినీ పార్క్​స్పెషల్​అట్రాక్షన్​గా నిలవగా, త్వరలో ట్యాంక్​బండ్​కు ఉత్తరాన సంజీవయ్య పార్క్​పరిసరాలకు కొత్త హంగులు తీసుకురాబోతున్నారు. బుద్దభవన్​నుంచి సంజీవయ్య పార్క్​వరకూ ఛత్​పూజ చేసుకునే ప్రాంతాలను, బతుకమ్మ ఘాట్లను విస్తరించి ఆధునీకరించాలని,  పీపుల్స్​ప్లాజా, నెక్లెస్​రోడ్, లుంబినీ పార్క్​వైపు ఎలా ఉందో అట్లనే తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్​ అధికారులు నడుం బిగించారు.  

ఘాట్ల సుందరీకరణ

నగరంలో స్థిరపడిన బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన మహిళలు ప్రతి యేడు కార్తీక మాసం, దీపావళి సందర్బంగా ఛత్ పూజను జరుపుకుంటారు. హుస్సేన్​సాగర్​తీరానికి వందల సంఖ్యలో చేరుకుని సూర్య భగవానుడికి, ఆయన సోదరి ఛతీ మైయాకు నైవేద్యాలు సమర్పిస్తారు. వీరితో పాటు బతుకమ్మ సందర్భంగా నిమజ్జనాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.

వీరి కోసం మూడేండ్ల కింద బీఆర్ఎస్​ప్రభుత్వం ట్యాంక్​బండ్​కు ఉత్తరాన బుద్ధభవన్​ఎదురుగా ఉన్న తీరం వద్ద ఘాట్లను నిర్మించింది. అయితే, నిర్వహణ సరిగ్గా లేకపోవడం, కేవలం పండుగల సందర్భాల్లోనే రంగులు వేసి రిపేర్లు చేస్తుండడంతో ప్రయోజనం లేకుండా పోతంది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఈ ఘాట్లను విస్తరించడంతో పాటు, పరిసరాలను అందంగా ముస్తాబు చేయనున్నట్టు ప్రకటించారు. వేల సంఖ్యలో వచ్చే మహిళలు కూర్చోడానికి కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. 

రూ. 3.16 కోట్లతో పనులు

బుద్ధ భవన్ వైపు నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఘాట్ల పునర్ నిర్మాణంతో బాటు రివెట్ మెంట్ వాల్ నిర్మాణానికి రూ. 3.16 కోట్లు వెచ్చించనున్నారు. 5,424 చదరపు మీటర్ల మేర గోడలకు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా అందమైన పెయింటింగ్స్ వేయనున్నారు.

ఘాట్ల పొడవునా పచ్చని చెట్లతో పాటు గార్డెనింగ్​ఏర్పాట్లు చేయనున్నారు. నెక్లెస్​రోడ్​ వైపున ఏ విధంగా ఉంటుందో..ఇటు సంజీవయ్యపార్క్​సమీపంలోనూ అలాంటి ఏర్పాట్లే చేయాలని నిర్ణయించారు. వచ్చే దసరా, దీపావళి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు...