డిండికి నీళ్లొచ్చేదెట్లా ?..నల్గొండ-మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల మధ్య వివాదం

డిండికి నీళ్లొచ్చేదెట్లా ?..నల్గొండ-మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల మధ్య వివాదం
  •     ఏదుల నుంచి తరలించాలని గతంలో నిర్ణయం
  •     నీటి లిఫ్టింగ్‌‌ విషయంలో వివాదం రేపిన ఈఎన్‌‌సీ సర్క్యులర్‌‌
  •     440 మీటర్ల ఎత్తు నుంచి లిఫ్ట్‌‌ చేస్తే డిండికి చేరేది ఏడు టీఎంసీలే...
  •     ఉమ్మడి నల్గొండకు అన్యాయం జరుగుతుందంటున్న ఎమ్మెల్యేలు

నల్గొండ, వెలుగు : నల్గొండ, -మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల మధ్య ఉన్న డిండి ఎత్తిపోతల పథకం మరో వివాదానికి తెరలేపింది. రూ. 1500 కోట్ల అంచనాతో చేపట్టిన డిండి లిఫ్ట్‌‌ స్కీంపై మొదటి నుంచీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. డిండి స్కీంకు నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలన్న విషయంపై రెండు జిల్లాల మధ్య సమస్య తలెత్తింది. దీంతో గత ప్రభుత్వం ఈ స్కీంను పక్కన పడేసింది. కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి.. ఇరిగేషన్‌‌ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డిని ఒప్పించి టెండర్లు, అగ్రిమెంట్లను పూర్తి చేయించారు. పాలమూరు కింద చేపడుతున్న ఏదుల రిజర్వాయర్‌‌ నుంచి డిండి లిఫ్ట్‌‌ స్కీంకు నీటిని తరలించేందుకు ప్రభుత్వం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. కానీ ఇటీవల రిటైర్డ్‌‌ అయిన ఓ ఈఎన్‌‌సీ గతంలో ఇచ్చిన సర్క్యులర్‌‌ కొత్త వివాదానికి తెరలేపింది. 

నెలకు 120 టీఎంసీలు 

కృష్ణా నదీ నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌కు రోజుకు 1.50 టీఎంసీలు, డిండి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీంకు 0.5 టీఎంసీలు చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తరలించేందుకు 2015లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి వైపు ఏదుల, వట్టెం, నార్లాపూర్‌‌ రిజర్వాయర్ల నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఇదే క్రమంలో నల్గొండ జిల్లాలో 11 రిజర్వాయర్లను చేపట్టగా... కిష్టరాంపల్లి, చింతపల్లి రిజర్వాయర్లు మినహా మిగతావన్నీ పూర్తయ్యాయి. భూసేకరణ, ఆర్‌‌అండ్‌‌ఆర్‌‌ ప్యాకేజీ వల్ల నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలోని ఎర్రబెల్లిగోకారం, రంగారెడ్డి జిల్లాలోని ఇర్విన్‌‌ రిజర్వాయర్లు, నల్గొండ జిల్లాలో ప్రధాన కాల్వల పనులు పెండింగ్‌‌లో ఉన్నాయి.

వివాదం రేపిన ఈఎన్‌‌సీ సర్క్యులర్‌‌

నీటి వాటాల కేటాయింపులో మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ జిల్లా మధ్య ఎప్పటినుంచో గొడవలు జరుగుతున్నాయి. ఇరిగేషన్‌‌ శాఖకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి డిసెంబర్‌‌లో ఇచ్చిన సర్క్యులర్‌‌ ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది. ఏదులలో 436 మీటర్ల ఎత్తు నుంచే పాలమూరు వైపు ఎనిమిది మోటార్లు రన్‌‌ చేసి నీటిని తరలించాలని, అదే డిండి లిఫ్ట్​స్కీంకు మాత్రం 440 మీటర్ల ఎత్తు నుంచి నీటిని లిఫ్ట్‌‌ చేయాలని ఈఎన్సీ సర్క్యులర్‌‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. రెండు జిల్లాల మధ్య నాలుగు మీటర్ల తేడాతో అనుమతులు ఇవ్వడం వల్ల డిండి లిఫ్ట్​ స్కీంకు 30 టీఎంసీలకు బదులు కేవలం ఏడు టీఎంసీల నీరు మాత్రమే సరఫరా అయ్యే అవకాశం ఉంది. నీటి తరలింపు అంశంపైన ఈఎన్‌‌సీ ఇన్‌‌స్పెక్షన్‌‌ రిపోర్ట్‌‌ సైతం  ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల అభ్యంతరం 

నల్గొండలో మూడు రోజుల కింద జరిగిన ప్రగతి ప్రణాళిక సమీక్షలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిండి గురించే లేవనెత్తారు. దీనికి ఎమ్మెల్యే బాలు సైతం మద్దతు ఇవ్వడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. రెండు జిల్లాల ప్రజలకు అన్యాయం జరగకుండా సీఎం రేవంత్‌‌రెడ్డి సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌‌రెడ్డిని ఒప్పించాల్సిన బాధ్యత ఉత్తమ్‌‌దేనని, ఆయన జోక్యం చేసుకుంటే సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. మరో పక్క డిండి లిఫ్ట్​స్కీం విషయంలో 437 ఎత్తులోనే రెండు జిల్లాల వైపు నీటిని తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం అంగీకరించిందని, ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌‌ నేతృత్వంలో ఇటీవలే చర్చలు కూడా జరిగాయని సమాచారం.