అమరుల ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి :ఎంపీ గడ్డం వంశీకృష్ణ

అమరుల ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి :ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పాలన:ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • గోదావరిఖనిలో తెలంగాణ తల్లి, కాకా విగ్రహాలకు నివాళులు 

గోదావరిఖని, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షల మేరకు పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనిలోని జీఎం ఆఫీస్ ​సమీపంలో తెలంగాణ తల్లి, కాకా వెంకటస్వామి విగ్రహాలకు ఎంపీ వంశీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో ప్రజలను మోసం చేశారని, ప్రజాధనం దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. 

దివంగత నేత కాకా వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా ఎంపీ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్​ వెంకటస్వామి క్రియాశీల పాత్ర పోషించారని, ఎంపీగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రైలురోకో చేసి జైలుకు వెళ్లారని, పార్లమెంట్​లో ధర్నా చేశారని వివరించారు. తెలంగాణ ఉద్యమంతో తన తాత, తండ్రికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు తాను కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు పి.మల్లికార్జున్, పాకాల గోవర్ధన్​ రెడ్డి, కామ విజయ్, మల్లేశ్​యాదవ్, జీన్స్, సంజీవ్, నర్సింగ్​ దొర, జావిద్, గడ్డం మధు, నరేందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.