ఆగిన విత్తనశుద్ధి .. రెండేండ్లుగా మూలనపడ్డ బొప్పాస్పల్లి కర్మాగారం

ఆగిన విత్తనశుద్ధి .. రెండేండ్లుగా మూలనపడ్డ బొప్పాస్పల్లి కర్మాగారం
  • మూడేండ్ల కింద ప్రారంభమై ఏడాది మాత్రమే సాగిన పనులు 
  • నిరుపయోగంగా రూ.కోట్లు విలువ చేసే యంత్రాలు
  • ముణ్ణాళ్ల ముచ్చటగా మారిన మేలు రకం విత్తనాల పంపిణీ

నస్రుల్లాబాద్, వెలుగు : నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్​పల్లి గ్రామంలోని విత్తన శుద్ధి కర్మాగారం అలంకారప్రాయంగా మారింది. 4 జూన్ 2022లో కర్మాగారం ప్రారంభమై ఏడాది పాటు సాఫీగా సాగింది. అనంతరం మూతపడడంతో విత్తన శుద్ధి ఆగిపోయింది. మేలు రకం విత్తనాలతో అధిక దిగుబడులు సాధించవచ్చన్న అన్నదాతల సంతోషం ముణ్ణాళ్ల ముచ్చటగా మారింది.  రెండేండ్లుగా మేలు రకం విత్తనాలు అందక బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారంలో రూ.కోట్లు విలువ చేసే యంత్రాలు కూడా అలంకారప్రాయంగా మారాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్, సారంగాపూర్ ప్రాంతాల్లో విత్తన ఉత్పత్తి సంస్థ విత్తన శుద్ధి కర్మాగారాలను కొనసాగిస్తుండగా, బొప్పాస్​పల్లిలో మాత్రం మూలకు పడింది. 

నిర్లక్ష్యపు నీడలు..

బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గ ప్రాంతాల్లో పండించిన పంటలను ఇక్కడనే శుద్ధిచేసి అందించాలని నిర్మించిన విత్తన శుద్ధి కర్మాగారంపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. సుమారు రూ.ఐదు కోట్లు వెచ్చించి, బాన్సువాడ నియోజకవర్గంలోని బొప్పాస్​పల్లి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన విత్తన శుద్ధి కర్మాగారం, గోదాం నిరుపయోగంగా ఉన్నాయి. ఈ కర్మాగారంతో  మేలు రకం  వంగడాలు అందుతాయనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. గోదాంలో రూ.కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన యంత్రాలు తుప్పు పట్టి పోతున్నాయి. పక్షులకు ఈ గోదాం నిలయంగా మారింది. ఆఫీసర్లు, పాలకులు పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు.    

బొప్పాస్​పల్లి కర్మాగారం ఏర్పాటు ఇలా..

విత్తన శుద్ధితో పంటకు సోకే తెగుళ్ల నివారణతోపాటు అధిక దిగుబడులు సాధించవచ్చు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, రాష్ట్ర విత్తన ఉత్పత్తి సంస్థ  విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ముందుకు రాగా, అప్పటి ప్రభుత్వం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పాస్​పల్లి గ్రామంలో విత్తన శుద్ధి కర్మాగారాన్ని 4 జూన్ 2022లో ప్రారంభించింది. అప్పటి మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు కృషి చేశారు.

 రూ.4 కోట్ల 85 లక్షల, 33 వేల వ్యయంతో, 33 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంతో పాటు, రూ.2 కోట్లు వెచ్చించి విత్తన శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కర్మాగారానికి వ్యవసాయ  క్షేత్రం నుంచి ఐదు ఎకరాల భూమిని, కేవలం ఏడాదికి రూ.15 లీజుతో తెలంగాణ రాష్ట్ర విత్తన ఉత్పత్తి సంస్థ కు అప్పటి ప్రభుత్వం అప్పగించింది.  

మేలు రకం విత్తనాలు అందించాలి

బొప్పాస్​పల్లి విత్తన శుద్ధి కర్మాగారం నుంచి మేలు రకం విత్తనాలు అందించాలి. ఆఫీసర్లు  అవగాహన కల్పిస్తే విత్తనాలు కొనుగోలు చేయడానికి మేము సిద్ధం. విత్తన శుద్ధి కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభించాలి.

పి.భాగయ్య, కిష్టాపూర్ 

నకిలీ విత్తనాలతో నష్టపోయాం..

 బీర్కూర్​ మండలంలో నకిలీ విత్తనాలతో నష్టపోయాం. బొప్పాస్​పల్లి విత్తన శుద్ధి కర్మాగారం మూలకుపడడం బాధాకరం. ఆఫీసర్లు ఆలోచించి కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభించి, మేలు రకం విత్తనాలు అందించాలి. 

మేకల రాములు, బీర్కూర్ 

మూసివేసి రెండేండ్లు.. 

బొప్పాస్​పల్లి విత్తన శుద్ధి కర్మాగారం మూసివేసి రెండేండ్లు అయ్యింది. ఉత్పత్తి తక్కువగా అమ్ముడు పోవడం, డీలర్లు ముందుకు రాకపోవడంతో మూసివేయాల్సి వచ్చింది.  చైర్మన్​తో మాట్లాడి మళ్లీ ప్రారంభించేలా కృషి చేస్తా. 

రఘు, రీజినల్ మేనేజర్​