- రిటైర్డ్ రైల్వే ఆఫీసర్స్ అసోసియేషన్ సత్కారం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైలును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (అర్బన్ ట్రాన్స్పోర్ట్) ఎన్వీఎస్ రెడ్డికి ప్రతిష్టాత్మక అచీవర్స్ అవార్డు లభించింది. శనివారం సికింద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఆఫీసర్స్ అసోసియేషన్ ఆయనను ఈ అవార్డుతో సత్కరించి.. అచీవర్స్ క్లబ్లో చేర్చుకుంది.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో నిర్మాణంలో వినియోగించిన లేటెస్ట్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ ఇన్నోవేషన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇవి ఇప్పుడు హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్, ఐఎస్బీ వంటి అంతర్జాతీయ వర్సిటీలకు కేస్ స్టడీలుగా మారాయని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 25 సిటీల్లో మెట్రో ప్రాజెక్టులు నడుస్తున్నాయని, రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ల అనుభవం వాటికి, దేశాభివృద్ధికి అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ. వెంకటేశ్వర్, రిటైర్డ్ ఏజీఎం వి.ఎస్. శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
