ఉగ్ర పాక్ కు యూఎన్ లో పదవులా?

ఉగ్ర పాక్ కు యూఎన్ లో పదవులా?
  • ఆ దేశానికి ఉగ్రవాద నిరోధక  కమిటీల్లో బాధ్యతలపై ఖర్గే ఫైర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌‌‌‌కు యునైటెడ్‌‌‌‌ నేషన్స్‌‌‌‌ భద్రతా మండలిలో కీలక బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టెర్రరిజం నిరోధక కమిటీకి పాకిస్తాన్‌‌‌‌ను వైస్‌‌‌‌ చైర్మెన్‌‌‌‌గా నియమించడం, అలాగే 2025 ఏడాదికిగాను తాలిబన్‌‌‌‌ ఆంక్షల కమిటీ అధ్యక్ష బాధ్యతలు పాక్‌‌‌‌కు ఇవ్వడాన్ని ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పూర్తిగా దురదృష్టకరమని, ఆమోదయోగ్యంకానిదని పేర్కొన్నారు. యూఎన్‌‌‌‌ అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయమని మండిపడ్డారు. ఈ అంశంపై గురువారం ఎక్స్‌‌‌‌ వేదికగా ఖర్గే సుదీర్ఘ పోస్ట్ చేశారు. 

టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్‌‌‌‌కు మద్దతివ్వండి

పాకిస్తాన్‌‌‌‌కు వ్యతిరేకంగా భారత్‌‌‌‌ చేస్తున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని ఖర్గే రిక్వెస్ట్‌‌‌‌ చేశారు. పాకిస్తాన్‌‌‌‌కు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అందుతున్న ఆర్థిక సహాయ ప్యాకేజీలు, రుణాలను ఆ దేశం తన సైన్యం కోసం, టెర్రరిస్టుల కోసం ఉపయోగిస్తోందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఆవిధంగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌‌‌‌ను ఫైనాన్షియల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ గ్రే లిస్ట్‌‌‌‌లో పెట్టాలన్న భారత్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ను గుర్తించాలని ప్రపంచ దేశాలను కోరారు. టెర్రరిజాన్ని ఎంకరేజ్‌‌‌‌ చేస్తున్న పాకిస్తాన్‌‌‌‌ను భారత్‌‌‌‌తో పోల్చడం ఏనాటికీ సరికాదని అన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖర్గే డిమాండ్‌‌‌‌ చేశారు.