
- క్షేత్రస్థాయిలో పరిష్కారమవుతున్నవి పదుల సంఖ్యలోనే
- పెండింగ్ లోనే 4 వేలకుపైగా అర్జీలు
- గ్రీవెన్స్ హాలులో మొబైల్స్ తో టైంపాస్ చేస్తున్న కొందరు ఆఫీసర్లు
- దర్జాగా డుమ్మా కొడుతున్న మరికొందరు ఆఫీసర్లు
- కొత్త కలెక్టర్ దృష్టి సారిస్తేనే మేలు
హనుమకొండ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాల్సిన ప్రజావాణి కార్యక్రమం కొందరు ఆఫీసర్ల తీరుతో అభాసుపాలవుతోంది. వివిధ సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించేందుకు జనాలు ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కు దూర ప్రాంతాల నుంచి తరలివస్తుండగా, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ఆఫీసర్లు మొబైల్ ఫోన్లలో తలలు దూరుస్తున్నారు. కొందరు ఆఫీసర్లు ఏకంగా గ్రీవెన్స్ కు డుమ్మా కొడుతుండగా, ఇంకొందరు అటెండెన్స్కోసం కిందిస్థాయి, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పంపించి మమ అనిపిస్తున్నారు. దీంతో ప్రజావాణి లక్ష్యం కాస్త నీరుగారుతుండగా, కొత్త కలెక్టర్ గా చార్జ్ తీసుకున్న స్నేహ శబరీశ్ ప్రజావాణి కార్యక్రమాన్ని స్ట్రెంథెన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
4 వేలకుపైగా పెండింగ్..
హనుమకొండ కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కు జిల్లాలోని 14 మండలాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వివిధ సమస్యలపై ప్రతి గ్రీవెన్స్ లో వందకు పైగా దరఖాస్తులు అందజేస్తున్నారు. వారం, పది రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్న ఆఫీసర్లు ఆ తర్వాత వాటిని లైట్ తీసుకుంటున్నారు. గ్రీవెన్స్ లో దరఖాస్తు అందిన వెంటనే దానిపై యాక్షన్ తీసుకోవాల్సిన ఆఫీసర్లు రోజుల తరబడి వాటిని ఓపెన్ చేయడం లేదు. ఇందులో గతేడాది హసన్ పర్తి మండలం అన్నసాగర్కి చెందిన ఓ వృద్ధుడు కొడుకులు అన్నం పెట్టడం లేదని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు. ఆ దరఖాస్తుపై యాక్షన్ తీసుకోవాల్సిన ఆఫీసర్లు 15 రోజులు దాటినా అర్జీని ఓపెన్ చేయలేదు.
ఆఫీసర్ల నుంచి ఎలాంటి యాక్షన్ లేకపోవడంతో ఆ వృద్ధుడు కాస్త ఉరివేసుకుని చనిపోయాడు. ఇలా కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతుండగా, కలెక్టరేట్ లో 4 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉండటం గమనార్హం. కాగా, గ్రీవెన్స్ లో దరఖాస్తులు తీసుకోవడం మినహా వాటి పరిష్కారంపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కొత్త కలెక్టర్ ఫోకస్ పెడితేనే మేలు..
ప్రజావాణిలో భాగంగా అందించిన దరఖాస్తులపై పర్యవేక్షణ ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. దీంతోనే ఒకే సమస్యపై రెండుసార్లకు మించి ఫిర్యాదు చేసిన బాధితులు చాలామందే ఉన్నారు. ఆఫీసర్ల నిర్లక్ష్యంతో ఆఫీసుల్లో గ్రీవెన్స్ అప్లికేషన్లు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతుండగా, గత కలెక్టర్ ప్రావీణ్య పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా కొందరు అధికారులు తీరు మార్చుకోకుండా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్నేహ శబరీశ్ప్రజావాణిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కొందరు డుమ్మా, ఇంకొందరు టైంపాస్..
కలెక్టరేట్ లో నిర్వహించే గ్రీవెన్స్ కు అగ్రికల్చర్, డీఎంహెచ్వో, ఎడ్యుకేషన్, ఎండోమెంట్, ఎలక్ట్రిసిటీ, ఫారెస్ట్, ఫిషరీస్, గ్రౌండ్ వాటర్, హ్యాండ్లూమ్, ఇరిగేషన్, మైనింగ్, లేబర్ డిపార్ట్మెంట్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జడ్పీ, జీడబ్ల్యూఎంసీ, ఆర్ డబ్ల్యూఎస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.. ఇలా మొత్తంగా 52 డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్లు హాజరుకావాల్సి ఉంది. కానీ, కొంతమంది అధికారులు డుమ్మా కొడుతున్నారు. తమకు బదులుగా తమ కిందిస్థాయి స్టాఫ్ నో, ఆఫీస్ లో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందినో గ్రీవెన్స్ కు పంపించి చేతులు దులుపుకొంటున్నారు.
మరికొంతమంది గ్రీవెన్స్ కు వచ్చినా స్మార్ట్ ఫోన్లలోనే నిమగ్నమవుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఆన్ చేసి టైంపాస్ చేస్తున్నారు. కొందరు అధికారుల తీరు ప్రతి గ్రీవెన్స్ లో ఇలాగే ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.