- పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
అమీన్పూర్, వెలుగు: చందానగర్ జాతీయ రహదారి నుంచి శ్రీదేవి థియేటర్, బంధం కొమ్ము మీదుగా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వరకు జరుగుతున్న రహదారి విస్తరణలో భూములు, ఇండ్లు కోల్పోతున్నవారికి తాను అండగా ఉంటానని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం బంధంకొమ్ము రహదారి విస్తరణ పనులపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ చేశారు. భవిష్యత్లో ట్రాఫిక్ అవసరాల కోసం విస్తరణ చేపడుతున్నట్టు చెప్పారు. బంధంకొమ్ము రహదారి పక్కనే చెరువు ఉండడం వల్ల ఒకే వైపు 150 అడుగుల రహదారి విస్తరణ చేపడుతున్నారని, దీనివల్ల ఇళ్ల యజమానులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
రహదారి విస్తరణ వల్ల ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా.. చెరువు సమీపంలో రహదారికి సమాంతరంగా బ్రిడ్జి నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, తహసీల్దార్ వెంకటేశ్, లీడర్లు పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
ఆదర్శ మున్సిపాలిటీగా ఇస్నాపూర్
ఇస్నాపూర్ మున్సిపాలిటీని అందరి సహకారంతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లక్డారం వార్డు ఆఫీస్లో మున్సిపల్ చైర్పర్సన్ సుమలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పాలకవర్గ సమావేశానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మాధవి రెడ్డి, కమిషనర్ వెంకట కిషన్ పాల్గొన్నారు.
