
- టికెట్ల కోసం ఎమ్మెల్యేల వద్దకు క్యూ
- రిజర్వేషన్లపై ప్రభుత్వం, కోర్ట్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ
వరంగల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలన ముగిసి ఏడాదిన్నర కావస్తుండగా, ఎంపీపీ, జడ్పీటీసీ పాలన సైతం గతేడాది జులైలో ముగిసింది. ఆరు నెలల్లో తిరిగి ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. కాగా, ఈ నెల చివర్లో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనుందనే సంకేతాలతో అభ్యర్థులు అలర్ట్ అవుతున్నారు.
స్థానికంగా రాజకీయ అనుభవం ఉన్నవారు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. స్థానిక రిజర్వేషన్లు ఎంత శాతం అమలు చేస్తారు? ఏ మండలం, ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ అమలవుతందోననే విషయంలో క్లారిటీ లేకపోవడం అభ్యర్థులను కలవరపెడుతోంది.
బీసీ రిజర్వేషన్లు తగ్గించిన కేసీఆర్ సర్కార్..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం ఇష్టారీతిన స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను మార్చేసింది. 2019లో నిర్వహించాల్సిన సర్పంచ్ ఎన్నికల కోసం 2018లో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది. పదేండ్లకోసారి చట్టానికి సవరణలు చేస్తామని చెప్పింది. గతంలో ఉన్న బీసీల రిజర్వేషన్ 34 శాతాన్ని 23 శాతానికి తగ్గించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పలువురు హైకోర్ట్ గడప తొక్కారు. కాగా, సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉల్లంఘించేలా రిజర్వేషన్లు మార్చడంపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తలొగ్గిన కేసీఆర్ సర్కార్.. చేసేదేమీ లేక రాబోయే స్థానిక ఎన్నికలను సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తామని వివరణ ఇచ్చింది.
రిజర్వేషన్ల ప్రకటనపై ఉత్కంఠ..
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఏడాదిన్నరగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీగా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులకు..రాబోయే 15 రోజుల్లో తమ గ్రామం, వార్డు, మండలం ఏ సామాజికవర్గానికి రిజర్వ్ అవనుందో తెలియక ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే రిజర్వేషన్ల ఇష్యూ కోర్టులో ఉంది. ఈక్రమంలో ప్రభుత్వం మాత్రం రాబోయే నెలలో లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయనే మాట చెబుతోంది.
స్థానిక ఎన్నికలు మొత్తం బీసీ రిజర్వేషన్ల అమలు, కోర్ట్ నిర్ణయం చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం తరపున మంత్రులు, లీడర్లు బయట ఎక్కడ మాట్లాడొద్దని సీఎం, పీసీసీ చీఫ్ చెప్పారు. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో పర్యటించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. తాము రాష్ట్రవ్యాప్తంగా కులగణన చట్టం చేసి గవర్నర్ ఆమోదం, ఆపై కేంద్రానికి పంపామని తెలిపారు. అందువల్లే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఆలస్యం అవుతున్నట్లు వెల్లడించారు. దీంతో రిజర్వేషన్ల అమలుపై అభ్యర్థులు టెన్షన్ పడుతుండగా, విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో ఆసక్తిగా గమనిస్తున్నాయి.
అధికార పార్టీ టికెట్ కోసం..
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అధికార పార్టీ తరపున చాలాచోట్ల గులాబీ లీడర్లే స్థానిక ఎన్నికల్లోనూ సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, మెజారిటీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు హస్తం పార్టీవే కావడంతో స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరపున పోటీ చేసే వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో లోకల్ లీడర్ల చూపు అధికార పార్టీ టిక్కెట్లపై పడుతోంది. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ పోటీలో ఉండాలని భావిస్తున్న నేతలు ఓవైపు ఎమ్మెల్యేల వద్ద టిక్కెట్ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు జనాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.