
- రైతు కమిషన్ చైర్మన్కు గద్వాల రైతుల వినతి
హైదరాబాద్, వెలుగు: సీడ్ పత్తి సాగు చేస్తున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ గద్వాల రైతులు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ నేతృత్వంలో గద్వాల జిల్లా సీడ్ రైతులు కోదండ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీడ్ రైతులు మాట్లాడుతూ.. సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు దళారుల ద్వారా రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
సీడ్ కంపెనీలు విత్తనాలను నేరుగా రైతులకు ఇవ్వకుండా, మాఫియాగా వ్యవహరిస్తూ అమాయక రైతులను దోచుకుంటున్నాయని తెలిపారు. గతేడాది కంటే తక్కువ ధరకు పంట కొంటామని, పాస్ అయిన సీడ్ పంటను ఫెయిల్ అయిందని చెప్పి డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడుతున్నాయని ఆరోపించారు. దీంతో కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకునే దుర్భర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ టెస్టులు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ల్యాబ్లలోనే నిర్ధారించాలని రైతులు కోరారు.