
- కంపెనీలు, ఆర్గనైజర్ల ఇష్టారాజ్యం
- పంట చేలల్లో మొక్కలు తొలగించుకుంటున్న బాధిత రైతులు
గద్వాల, వెలుగు: సీడ్ పత్తి రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎకరాకు 150 ప్యాకెట్లు మాత్రమే కొనుగోలు చేస్తామని కంపెనీలు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీడ్ పంటను ఇప్పుడు తొలగిస్తే ఎకరాకు రూ.7,500 ఇస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీడ్ ప్యాకెట్ ధరను తగ్గించిన కంపెనీలు, ఇప్పుడు పంట కొనుగోలుపై సీలింగ్ పెట్టడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫౌండేషన్ సీడ్ ఇచ్చే సమయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా, విత్తనాలు పెట్టాక చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
సీడ్ పంటపై సీలింగ్..
జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తి పంట కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. జిల్లాలో 50వేల ఎకరాల వరకు సీడ్ పత్తి సాగు చేస్తారు. ఎకరాకు 300 నుంచి వెయ్యి ప్యాకెట్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ, కంపెనీలు మాత్రం ఎకరా సీడ్ వేసిన రైతు నుంచి 150 ప్యాకెట్లు మాత్రమే కొంటామని చెబుతున్నారు. కంపెనీలు ఇచ్చిన సీడ్ విత్తనాలు బహిరంగ మార్కెట్ లో అమ్ముకోవడం కుదరదు. ఏ కంపెనీ సీడ్ ఇచ్చిందో, ఆ కంపెనీ వాళ్లే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కానీ, కంపెనీలు పంట కొనుగోలుపై సీలింగ్ పెట్టడం తగదని రైతులు అంటున్నారు. జిల్లాలో 50 వేల ఎకరాల వరకు ఫౌండేషన్ సీడ్ ను కంపెనీలు పంపిణీ చేశాయి. ఎకరాకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేసి విత్తనాలు వేసుకున్నారు. ఈక్రమంలో సీడ్ కంపెనీలు యూటర్న్ తీసుకొని, పంటను తొలగించుకుంటే ఎకరాకు రూ.7,500 చెల్లిస్తామని ఆర్గనైజర్ల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఇప్పుడు వేరే పంటలు వేసుకోవడానికి అవకాశం లేదని, దీంతో తమకు పెద్ద ఎత్తున నష్టం వస్తుందని అంటున్నారు. కంపెనీలు, ఆర్గనైజర్ల తీరుతో విసిగిపోయిన కేటిదొడ్డి, గట్టు, ధరూరు మండలాల్లోని రైతులు మొక్కలను తొలగిస్తున్నారు. కొందరు రైతులు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తమకు అన్యాయం చేస్తున్న కంపెనీలు, ఆర్గనైజర్లను ఈ విషయంపై నిలదీస్తే తాము గతంలో తీసుకున్న అప్పు వెంటనే చెల్లించాలని ఒత్తిడి తెస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంపెనీలపై చర్యలు తీసుకోవాలి..
సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు మోసం చేశారు. ఈ ఏడాది పలు కంపెనీలు సీడ్ పంట వేయాలని చెప్పి ఫౌండేషన్ సీడ్ ఇచ్చారు. ఇప్పుడు 150 ప్యాకెట్లు మాత్రమే తీసుకుంటామని మాట తప్పుతున్నారు. ప్యాకెట్లు కొనకపోతే నష్టపోతాం. కంపెనీలపై చర్యలు తీసుకోవాలి.- నర్సింలు, ధరూరు