
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రమాద బీమా పథకం అమలులో దేశానికే సింగరేణి ఆదర్శంగా నిలుస్తోందని సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం పేర్కొన్నారు. మణుగూరు ఏరియాలో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న మూల్చంద్ విశ్వకర్మ ఇటీవల యాక్సిడెంట్లో చనిపోయాడు. విశ్వకర్మకు ఎస్బీఐకు శాలరీ అకౌంట్ఉందని, దీంతో ఆయనకు రూ. కోటి బీమా వర్తించింది. రూ.కోటి చెక్కును కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో శుక్రవారం జరిగిన ప్రోగ్రాంలో మూల్చంద్ కుటుంబానికి డైరెక్టర్లు అందజేశారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎండీ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి సంస్థ బ్యాంకర్లతో మాట్లాడి గరిష్ఠంగా రూ. 1.25కోట్ల మేర ప్రమాద బీమా వర్తించేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. ఈ బీమాతో మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రూ. 40లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.