
న్యూఢిల్లీ: అసలు తాను ఎలా ప్రాణాలతో బయటపడ్డానో తనకే తెలియదని విశ్వాస్ కుమార్ రమేశ్ తెలిపాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బతికి బయటపడిన అతను.. ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. విశ్వాస్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు జరిగిన ఘటనను వివరించాడు. ‘‘విమానం బిల్డింగ్ను ఢీ కొట్టడంతో నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా.. అందువల్లే నేను మంటల్లో చిక్కుకోలేదు.
ఫ్లైట్ కూలిపోతున్నప్పుడు నేను కూడా చనిపోతానని అనుకున్నాను. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఎలా బతికానో నాకే తెలియదు. వెంటనే సీటు బెల్ట్ తీసేసి, అక్కడున్న డోర్ ద్వారా బయటకు వచ్చేశాను. నా కండ్ల ముందే మిగతా వాళ్లందరూ చనిపోయారు” అని తెలిపాడు. ‘‘ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే సమస్య మొదలైంది. గ్రీన్, వైట్ లైట్స్ వచ్చాయి. ఫ్లైట్ను పైకి తీసుకెళ్లేందుకు పైలెట్లు ప్రయత్నించినప్పటికీ, అది బిల్డింగ్ను ఢీకొట్టింది.
ఆ టైమ్లో నేను కూర్చున్న సైడ్ భాగం గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయింది. నా పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్ ధ్వంసమైంది. అలా నేను అందులో నుంచి దూకి బయటపడ్డాను. వెంటనే అక్కడి నుంచి పరుగెత్తాను. ఆ తర్వాత ఫ్లైట్ పేలిపోయింది. మంటల్లో అందరూ కాలిపోయారు. నేను దూరంగా ఉండగా, నా ఎడమ చేతికి కాలిన గాయమైంది” అని చెప్పాడు.