- నెల్లికల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పనులకు అనుమతి
- ప్రాజెక్టుకు 3.13 హెక్టార్ల అటవీ భూమి బదిలీ ప్రక్రియలో మార్పులు
- ఎయిర్టెల్ ఓఎఫ్సీ పనులకు
- 0.19 హెక్టార్ల భూమి కేటాయింపు
- రావిర్యాల్ - ఆమన్గల్ రేడియల్ రోడ్డుకు 87.66 హెక్టార్లకు అనుమతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అటవీ అనుమతుల అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం అటవీ భూముల బదలాయింపునకు తుది అనుమతులు మంజూరు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో మనోహరాబాద్–కొత్తపల్లి కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి అటవీశాఖ పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు కోసం సిరిసిల్ల ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని 15.2105 హెక్టార్ల అటవీ భూమి బదలాయింపుకు అనుమతి లభించింది. అయితే అటవీ ప్రాంతంలో రైళ్ల వేగాన్ని నియంత్రించాలని, వన్యప్రాణుల రాకపోకలకు వీలుగా రైల్వేశాఖ అండర్ పాస్లు నిర్మించాలని నిబంధనలు విధించింది. ఈ ప్రాజెక్టు వల్ల కోల్పోయే అటవీ భూమికి పరిహారంగా, అడవుల పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ ప్లాన్, నెట్ ప్రెజెంట్ వ్యాల్యూ కింద రైల్వేశాఖ రూ.8.98 కోట్లను పరిహారంగా చెల్లించింది. కొండాపూర్ గ్రామంలో 15.42 హెక్టార్లు, మద్దిమల్ల బీట్లో 28 హెక్టార్లు, అనంతారం బీట్లో 3 హెక్టార్ల భూమిని అటవీ పెంపకం కోసం కేటాయించారు.
నెల్లికల్ ఎత్తిపోతలకు ‘అటవీ’ క్లియరెన్స్..
నల్లగొండ జిల్లాలోని నెల్లికల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ భూముల మళ్లింపును ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున సాగర్ డివిజన్లోని నెల్లికల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 3.1346 హెక్టార్ల అటవీ భూమిని ఈ ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుది అనుమతులు మంజూరు చేశాయి. ఈ భూమిలో ప్రాజెక్టుకు అవసరమైన ఇన్టేక్ పైప్లైన్, జాక్వెల్, పంప్హౌస్ వంటి నిర్మాణాలను చేపట్టనున్నారు.
సాగర్ అడవుల్లో ‘4జీ’ సేవలు..
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఎయిర్టెల్ 4జీ మొబైల్ సేవలను అందించేందుకు తుది అనుమతులు మంజూరు చేసింది. నిడిగల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పోలేపల్లి నుంచి చిత్రియాల వరకు రోడ్డు వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్ వేసేందుకు 0.1987 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు ప్రభుత్వం స్టేజ్-2 క్లియరెన్స్ ఇచ్చింది. కేబుల్ వేసే కందకం లోతు 2 మీటర్లకు మించకూడదు. వెడల్పు 0.45 మీటర్లలోపే ఉండాలి. కోల్పోయిన అటవీభూమికి పరిహారంగా ఎయిర్టెల్ సంస్థ 100 మొక్కలు నాటి సంరక్షించాలి.
‘గ్రీన్ ఫీల్డ్’ రోడ్డుకు తొలగిన అడ్డంకులు
ఓఆర్ఆర్ రావిర్యాల్ ఇంటర్చేంజ్ నుంచి ట్రిపుల్ఆర్ ఆమన్గల్ వరకు నిర్మించనున్న ‘గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు’కు లైన్ క్లియర్ అయింది. ఈ ప్రాజెక్టు కోసం రంగారెడ్డి జిల్లా పరిధిలోని 87.6670 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు ప్రభుత్వం తుది అనుమతులు ఇచ్చింది. ఈ రోడ్డును ‘మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్’గా నిర్మించనున్నారు. రోడ్డుకు ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్, వాక్వేలు ఉంటాయి. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు శబ్ద కాలుష్యం కలగకుండా ‘నాయిస్ కంట్రోల్ బారియర్లు’ (శబ్దాన్ని నిరోధించే గోడలు) ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రంగారెడ్డి జిల్లాలో కోల్పోయే అటవీ భూమికి పరిహారంగా ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలో 97.42 హెక్టార్ల భూమిలో 41,107 మొక్కలను నాటనున్నారు. ఇందుకోసం హెచ్జీసీఎల్ సంస్థ ప్రభుత్వం వద్ద మొత్తం రూ.25.49 కోట్లు డిపాజిట్ చేసింది. అటవీ జంతువుల రాకపోకలకు ఆటంకం కలగకుండా కల్వర్టులు, బ్రిడ్జిల డిజైన్లు ఉండాలని స్పష్టం చేసింది. అలాగే చెట్లపై నివసించే పక్షుల కోసం కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
