- ఎవ్వరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతం: సీఎం రేవంత్
- పదేండ్ల బీఆర్ఎస్, 12 ఏండ్ల బీజేపీ, 30 నెలల ప్రజా పాలనపై అసెంబ్లీలో చర్చకు రెడీ
- ఎస్ఎల్బీసీని పదేండ్లు పడావు పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్
- ఎలక్షన్లు తేవడం, కలెక్షన్లు చేసుకోవడమే బీఆర్ఎస్ చేసిన త్యాగమా?
- మలిదశ ఉద్యమంలో మంత్రి వెంకట్రెడ్డి పదవికి రాజీనామా చేశారు
- ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేశారు
- తెలంగాణ సమాజం త్యాగాలు చేస్తే.. పదవులు కేసీఆర్ కుటుంబం అనుభవించింది
- రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలనే.. మళ్లీ ‘పాపాల భైరవుడి’ పాలన అవసరమా?
- పదేండ్లు అధికారం మాదే.. ఇది పక్కా రాసి పెట్టుకోండి
- వచ్చే ఎన్నికల్లోపు ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని వెల్లడి
- రూ.13 వేల కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రారంభం.. నల్గొండ సభలో సీఎం ప్రసంగం
నల్గొండ, వెలుగు: ఒట్టేసి చెబుతున్నా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎవ్వరు అడ్డమొచ్చినా తొక్కుకుంటూ పోతానని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోనని చెప్పారు. ఎవరైనా హైదరాబాద్ను చూసేందుకు వస్తే అది మూసీ సుందరీకరణ చూడటానికే అయి ఉండాలని పేర్కొన్నారు. ‘‘పదేండ్లు మేమే అధికారంలో ఉంటాం.. ఇది పక్కా రాసి పెట్టుకోండి”అని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ఆదివారం నల్గొండలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.13 వేల 6 కోట్లతో 6,092 కిలోమీటర్ల మేర నిర్మించబోయే 441 రహదారుల నిర్మాణ పనులను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హ్యామ్ రోడ్స్ పైలాన్ను ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూ.83 కోట్లతో చేపట్టనున్న మొదటి దశ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.
మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన సభలో రేవంత్రెడ్డి ప్రసంగించారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ జరపడానికి రెడీగా ఉన్నామని ప్రకటించారు.10 ఏండ్ల బీఆర్ఎస్, 12 ఏండ్ల బీజేపీ, రెండున్నరేండ్ల తమ పాలనపై చర్చ జరిపేందుకు అసెంబ్లీకి రావాలన్నారు. రెడీగా ఉంటే వెంటనే శాసనసభ స్పీకర్కు, శాసన మండలి చైర్మన్కు లేఖలు రాయాలని సవాల్ విసిరారు. ఎస్ఎల్బీసీని పదేళ్లు పడావు పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఎస్ఎల్బీసీతో పాటు డిండి ప్రాజెక్ట్ను పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.
ఎలక్షన్లు తేవడం, కలెక్షన్లు చేసుకోవడమే త్యాగమా?
తెలంగాణ సమాజం త్యాగాల పునాదులపై నిలబడిందని సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ‘‘తొలి తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేస్తే.. మలి దశ ఉద్యమంలో నల్గొండ గర్వించదగ్గ బిడ్డ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన పదవిని త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు’’ అని సీఎం అన్నారు. ‘‘తెలంగాణ వచ్చాకే ఆయన మళ్లీ మంత్రి పదవి చేపట్టారు. కానీ.. త్యాగాల పునాదులపైన అధికారంలోకి వచ్చామని బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెపుకుంటున్నారు.. రాజీనామాలు చేయడం, ఎన్నికలు తేవడం, కలెక్షన్లు చేసుకోవడమే వారు చేసిన త్యాగమా?’’ అని రేవంత్ విమర్శించారు. శ్రీకాంతా చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇషాన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డిల ప్రాణ త్యాగాలను అగౌరవపరుస్తూ.. వంద రూపాయల పెట్రోల్ పోసుకుని పది పైసల అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టె రావు (హరీశ్రావు) లాంటి వారు పదేండ్ల పాటు మంత్రి పదవులు అనుభవించారని మండిపడ్డారు. వందల మంది త్యాగాలు చేసి తెలంగాణ సాధిస్తే దాన్ని బీఆర్ఎస్ నేతలు వాళ్ల ఖాతాలో వేసుకున్నారని అన్నారు. మిగులు బడ్జెట్తో అప్పగించిన రాష్ట్రాన్ని పదేండ్లలోనే 8.11 లక్షల కోట్ల అప్పుచేసి వందేండ్లకు సరిపోయే విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. భార్య, భర్తల మధ్య ఫోన్లను చాటుగా విన్న వాళ్లను దేనితో కొట్టాలని ప్రజలను అడిగారు.
తోడేళ్లలా తిరుగుతున్న బావాబామ్మర్దులు
రాష్ట్రాన్ని పదేండ్లపాటు దోచుకున్న బావాబామ్మర్దులు (హరీశ్రావు, కేటీఆర్) మళ్లీ జనాల మధ్య తోడేళ్లలా తిరుగుతున్నారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కేటీఆర్, హరీశ్రావు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ కుటుంబాన్ని, మీ పార్టీని తెలంగాణ సమాజం శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేసిందని అన్నారు.‘‘మీరు అధికారంలోకి రావాలని మీతో పాటు అవినీతి చేసిన లీడర్లు, సంస్థలు, బోగస్ నాయకులు మాత్రమే కోరుకుంటున్నారు. మీ దోపిడీని కళ్లారా చూసిన ప్రజలెవ్వరూ ఈ విషయాన్ని కోరుకోవడం లేదు” అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఉప్పుపాతరేశారన్నారు. ‘‘ఇక్కడ ఆ పార్టీ మొక్క కూడా మొలవనివ్వమని నల్గొండ జిల్లా ప్రజలు నాతో చెప్పారు.. భవిష్యత్తులో మీకు పదవులు ఉండవు.. మీకు భవిష్యత్తు లేదు.. గతం గురించి మాట్లాడుకోవడమే మీకు మిగిలి ఉన్నది” అని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ చురకలంటిచారు. అధికారం కోల్పోయిన అక్కసుతో కడుపు నిండా విషంతో బావాబామ్మర్దులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగామాట్లాడుతున్నారని, మూసీలో ఉన్న కాలుష్యం కంటే వీరి కడుపులో ఉన్న కంపు ఎక్కువైందని విమర్శించారు. ‘‘తులసీ వనంలో గంజాయి మొక్కలా సూర్యాపేటలో ఒకరు మిగిలారు.. రాబోయే ఎన్నికల్లో ఆయనను కూడా మిగలనివ్వమని కాంగ్రెస్ కార్యకర్తలు నాకు మాటిచ్చారు’’ మాజీ మంత్రి జగదీశ్రెడ్డిపై సెటైర్లు వేశారు.
అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చకు మేం రెడీ
అసెంబ్లీలో అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘‘రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ఏం చేసింది.. రేవంత్రెడ్డి ఏం తెచ్చాడని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పదేండ్ల బీఆర్ ఎస్, 12 ఏండ్ల బీజేపీ, రెండున్నరేండ్ల మా పాలనపై అసెంబ్లీలో చర్చ జరుపుదాం. ప్రభుత్వం తరఫున ప్రత్యేక అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. మీరు రెడీ అయితే శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్లకు లెటర్లు రాయండి’’ అని ప్రతిపక్ష పార్టీలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. ‘‘ మేం లక్షలాది రేషన్ కార్డులిచ్చినం. పేదలకు ఆ నాడు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాణాగా పెట్టారు. కానీ.. మేం ఆర్థికంగా భారమైనా సరే పేదవాడి కడుపు నింపాలని రాష్ట్రవ్యాప్తంగా 3.20 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నాం. ఫామ్హౌస్లో పడుకున్న కేసీఆర్, కేటీఆర్ వారి ఇంట్లో ఏ సన్న బియ్యం తింటున్నారో పేదల పిల్లలు కూడా అవే తింటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘బిల్లా– రంగాలు ఊరూరా తిరిగి అబద్ధాలు చెపుతున్నారు. మా ప్రభుత్వంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టామా? ప్రశ్నప్రతాలను లీక్ చేసి కోట్లు సంపాదించుకున్న వీళ్లు మళ్లీ రావాలా?’ ’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తున్నదని, మళ్లీ ‘పాపాల భైరవుడి’ పాలన అవసరమా? అని అడిగారు.
పేదలు ఇండ్లు కట్టుకుంటే..వాళ్లకు కండ్లు కుడుతున్నయ్!
రాష్ట్రంలో పేదలు సొంతిళ్లు కట్టుకుంటుంటే కేసీఆర్ కుటుంబం కండ్లు కుడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘గజ్వేల్లో కేసీఆర్ వెయ్యి ఎకరాల్లో, జన్వాడలో కొడుకు కేటీఆర్, శంకర్పల్లిలో బిడ్డ కవిత వంద ఎకరాలల్లో ఫామ్హౌస్ లు కట్టుకుంటే ఏం లేదు కానీ పేదోళ్లు రూ.5 లక్షల ప్రభుత్వ సొమ్ముతో ఇళ్లు నిర్మించుకొని గృహప్రవేశాలు చేసుకుంటే వీళ్లు ఓర్వడం లేదు” అని అన్నారు. పేదవాడి ఆత్మగౌరవం అయిన సొంతిళ్లను ఆనాడు కేసీఆర్ సర్కారు విస్మరించిందని మండిపడ్డారు. గడీలు, ఫామ్హౌస్ ల గురించి కలలు కన్నారు తప్ప పేదోడి ఇల్లు గురించి ఆలోచించలేదని, ఒక్క ఏడాదిలో 2 లక్షల ఇండ్లు ఇచ్చినా పదేండ్లలో 20 లక్షల ఇండ్లను పేదలు నిర్మించుకునేవాళ్లని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే పేదలకు 4.5 లక్షల ఇండ్లు ఇచ్చామని, ఇందిరమ్మ ఇల్లు పేదవాడి ఆత్మగౌరవం అని చెప్పారు. పేదల ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం వీళ్ల కళ్లకు కనిపించలేదా? అని ఆయన ప్రశ్నించారు.
రైతులకు రూ.1.56 లక్షల కోట్లు అందించాం
రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్తోపాటు అనేక కార్యక్రమాలతో గడిచిన రెండున్నరేండ్లలో రూ.1.56 లక్షల కోట్లను రైతులకు అందించామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు. ‘‘కేసీఆర్ పాలనలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయింది.
ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అప్పటి గవర్నర్కు అబద్ధాలు చెప్పి కాళేశ్వర్రావు అని ఆయన చేత పిలిపించుకున్నారు. అది కూలిపోతే అటు దిక్కు కూడా చూడలేదు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా మా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వడ్లు పండించి 80 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసి రికార్డులు సృష్టించింది. ఇది మా ప్రభుత్వ నిబద్ధత” అని తెలిపారు.50 ఏండ్లలో పరిష్కారం కాని ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు.‘‘ప్రభుత్వ పాఠశాల్లో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు తరగతులు ప్రవేశపెట్టి.. టిఫిన్, లంచ్, స్నాక్స్ ఇస్తున్నాం. దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తున్నాం. 30 నెలల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం’’ అని తెలిపారు. ‘‘ఇవన్నీ అభివృద్ధి పనులు కావా? ఇన్ని గొప్ప గొప్ప పనులు చేసినందుకు ప్రజాపాలన పోవాల్నా?’’ అని మండిపడ్డారు.
మూసీ నది ప్రక్షాళన ఖాయం
పదేండ్లు తామే అధికారంలో ఉంటామని, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతానని సీఎం రేవంత్ తెలిపారు. మూసీ మురికి వల్ల నల్గొండ ఆడబిడ్డలకు కన్ను, కాలు వంకర పిల్లలు పుడుతున్నారనే భయం ఉందన్నారు. కొత్తగా పెళ్లిల్లు కాగానే దంపతులను హైదరాబాద్లో పనిచేసుకోవడానికి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. . ‘‘కేసీఆర్ కుటుంబం నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే చెబుతున్నది. రూ.687 కోట్లతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శాఖలో టెండర్లు పిలిస్తే రూ.3 వేల కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నరు. సింగరేణిలో టెండర్ కాకుండానే ఆ సంస్థ నిధులు వేల కోట్లు కొల్లగొట్టారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీరెన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. మీ జాతకం అంతా తెలంగాణ ప్రజలకు తెలుసు” అని వ్యాఖ్యానించారు.
