- జర్మనీ, స్విట్జర్లాండ్కు 35 మంది ఉన్నత స్థాయి బృందం
- యోగితా రాణా నేతృత్వంలో వీసీలు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు
- అంతర్జాతీయ విద్యా ప్రమాణాలపై స్టడీ చేయనున్న టీమ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని హయ్యర్ ఎడ్యుకేషన్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లోని విద్యా విధానాలను, నైపుణ్యాభివృద్ధి పద్ధతులను స్టడీ చేసేందుకు 35 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆదివారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లింది. జూన్ 28 నుంచి జులై 6 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ విజన్కు అనుగుణంగా, విదేశీ వర్సిటీలతో విద్యా భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ఈ పర్యటన దోహదపడనుంది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలోని ఈ టీమ్లో విద్యాశాఖ అదనపు కార్యదర్శి సైదా, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఓయూ వీసీ కుమార్ సహా వీసీలు జీఎన్ శ్రీనివాస్, ఆల్తాఫ్ హుస్సేన్, ఉమేశ్ కుమార్, ప్రతాప్ రెడ్డి సహా పలువురు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు, అధికారులు ఉన్నారు.
జర్మనీలో అమలవుతున్న డ్యూయల్ అప్రెంటిస్షిప్ విధానాన్ని ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించనుంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్లో మార్పులు, స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల మార్పిడి ప్రోగ్రామ్లు వంటి అంశాలపై అక్కడి నిపుణులతో చర్చించనున్నారు. ఈ క్రమంలో ఆర్ డబ్ల్యూటీహెచ్ ఆచెన్ వర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ గాట్టింజెన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలను సందర్శిస్తారు. పారిశ్రామిక సందర్శనలో భాగంగా స్టట్గార్ట్లోని మెర్సిడెస్-బెంజ్ తయారీ కేంద్రాన్ని సందర్శించి, పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య సమన్వయం ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లోనూ పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు.
