- ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు
- 2021‑22 లో రాష్ట్రాలకు వ్యాట్ రెవెన్యూ బాగా వచ్చింది
- ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై వాల్యు యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) తగ్గించడానికి వీలుందని స్టేట్ బ్యాంక్ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినప్పుడు రాష్ట్రాలకు వ్యాట్ ద్వారా వచ్చిన ఆదాయం బాగా పెరిగిందని వివరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినప్పుడు వ్యాట్ కింద రాష్ట్రాలకు 2021–22 లో రూ. 49,229 కోట్లు వచ్చాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై రూ. 8, డీజిల్పై రూ. 6 ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర తగ్గించింది. దీనికి తగ్గట్టు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గాయి. రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్ పెట్రోల్, డీజిల్ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో వీటి రేట్లు తగ్గాయి. ఫలితంగా రాష్ట్రాలు రూ. 15,021 కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నాయి. అయినప్పటికీ, రాష్ట్రాలకు నికరంగా రూ. 34, 208 కోట్ల ఆదాయం మిగులుతుందని ఎస్బీఐ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో రాష్ట్రాలు పెట్రోల్,డీజిల్పై వ్యాట్ను తగ్గించడానికి వీలుంటుందని వివరించింది. కానీ, వ్యాట్ తగ్గించాలా? లేదా? అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ రాష్ట్రాలు తగ్గించొచ్చు..
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నప్పుడు తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలు వ్యాట్ కింద ఎక్కువ రెవెన్యూని పొందాయని ఎస్బీఐ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. కరోనా సంక్షోభం తర్వాత నుంచి ఆర్థికంగా రాష్ట్రాలు మెరుగుపడుతున్నాయని, పెట్రో ట్యాక్స్లకు అవసరమైన అడ్జస్ట్మెంట్లను చేయడానికి వీటికి వీలుంటుందని వివరించారు. ‘ఆయిల్పై ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చిన మొత్తం రెవెన్యూని అడ్జస్ట్ చేస్తే అంటే, ఆయిల్ రెవెన్యూపై ఎటువంటి లాభం లేదా నష్టం లేకుండా చూసుకుంటే రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్ను తగ్గించొచ్చు. రాష్ట్రాలు బడ్జెట్లో పెట్టుకున్న ఆయిల్ రెవెన్యూ కంటే ఎక్కువ లేదా తక్కువ లేకుండా అడ్జస్ట్ చేయగలిగితే రాష్ట్రాలు లీటర్ పెట్రోల్పై సగటున రూ. 3, డీజిల్పై రూ. 2 తగ్గించడానికి వీలుంటుంది’ అని ఎస్బీఐ రిపోర్ట్ వివరించింది. మహారాష్ట్ర డెట్ టూ జీడీపీ రేషియో (జీడిపీలో అప్పుల శాతం) తక్కువగా ఉంది. అందువలన ఈ రాష్ట్రం లీటర్ డీజిల్, పెట్రోల్పై రూ. 5 వరకు ట్యాక్స్ తగ్గించొచ్చని ఎస్బీఐ రిపోర్ట్ లెక్కించింది. ఇంకా ట్యాక్స్–జీడీపీ రేషియో (జీడీపీలో ట్యాక్స్ల వాటా) 7 % కంటే ఎక్కువగా ఉన్న తెలంగాణ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై విధించే ట్యాక్స్ను అడ్జస్ట్ చేయడానికి ఎక్కువ వీలుంది’ అని పేర్కొంది.
తెలంగాణకు 2021-22 లో రూ. 4,310 కోట్ల వ్యాట్ ఆదాయం..
తెలంగాణ రాష్ట్రానికి 2021–--22 లో పెట్రోల్ వ్యాట్ కింద రూ. 4,310 కోట్ల ఆదాయం వచ్చింది. తాజాగా రేట్లు తగ్గడంతో రాష్ట్రం కోల్పోయే వ్యాట్ రెవెన్యూ రూ. 1,098 కోట్లుగా ఉంటుంది. అంటే రూ. 3,212 కోట్ల రెవెన్యూ మిగిలే ఉంటుంది. తెలంగాణ డెట్ టూ జీడీపీ రేషియో (జీడిపీలో అప్పుల శాతం) కూడా 27.4 శాతమే. ట్యాక్స్ టూ -జీడీపీ రేషియో (జీడీపీలో ట్యాక్స్ల వాటా) కూడా 7 శాతానికి పైనే ఉంది. పెట్రో రేట్లను తగ్గించినా రాష్ట్రానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావని ఎస్బీఐ పేర్కొంది.