
- ఈ నెలలో మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కమిటీలు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, అధికారంలో ఉన్నప్పుడు మరింత ఉత్సాహంతో పనిచేయాలని కాంగ్రెస్ నేతలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. పార్టీ సమర్థవంతంగా పనిచేస్తేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు.
నీతి, నిజాయతీ, మచ్చలేని నేత మీనాక్షి నటరాజన్ ను మన రాష్ట్రానికి ఇన్చార్జిగా హై కమాండ్ నియమించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. మహిళలకు ఫ్రీ జర్నీ నుంచి మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, అయినా కార్యకర్తలు నిరాశగా ఉన్నారని , వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలదేనని స్పష్టం చేశారు.
ఈ నెలలోనే పీసీసీ కమిటీలు, మంత్రి వర్గ విస్తరణ పూర్తవుతుందని చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఆదేశించారు. కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ తప్పేం లేదని ఈటల చెబుతున్నరు
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ అనంతరం ఈటల మాటలు విన్నాక ఆశ్చర్యమేసిందని మహేశ్గౌడ్ తెలిపారు. బ్యారేజీల నిర్మాణంలో కేసీఆర్ తప్పేమీ లేదని, అంతా కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని ఈటల రాజేందర్ బుకాయిస్తున్నారని అన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి.. ప్రాజెక్టు నిధులతో తనకు సంబంధమే లేదనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని దేశమంతా కోడై కూసిందని, ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా అనేక సార్లు ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది. వేల కోట్ల అవినీతి జరిగింది’’అని ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కానీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అందుకు భిన్నంగా కమిషన్ ఎదుట ఇచ్చిన వివరణను చూస్తే కేసీఆర్ తో కుమ్కక్కైనట్టు స్పష్టమైందన్నారు. ఈటలకు కూడా వాటాలు ముట్టినందునే కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడారన్నారు. విచారణ అనంతరం ఈటల వ్యాఖ్యలు వింటుంటే.. ఆయన హరీశ్ రావుతో రహస్యంగా భేటీ అయ్యారని తాను చెప్పిన మాటలు నిజమని తేలిందన్నారు.
కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని మొత్తుకున్న బీజేపీ నాయకులు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో బీజేపీకి ఉన్న లోపాయికారి ఒప్పందం మేరకే కేసీఆర్ ను కాపాడేందుకు ఈటలతో వివరణ ఇప్పించారా? అన్న అనుమానం ఉందన్నారు.
గెలుపు కోసం పనిచేశాం: మంత్రి పొన్నం
కరీంనగర్ ఎంపీ టికెట్ లేట్ గా ప్రకటించినప్పటికీ గెలుపు కోసం చివరి వరకూ పోరాడామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకి పదవులు ఇవ్వాలని చెప్పామన్నారు. రివ్యూ అనంతరం గాంధీ భవన్ లో పొన్నం మీడియాతో మాట్లాడారు. ఈటల... కాళేశ్వరం జ్యుడీషియల్ కమీషన్ ముందు నిజం చెప్పాల్సిందని అన్నారు.
బనకచర్ల విషయం లో కేంద్రం మీద బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉన్నాయని ప్రశ్నించారు. తెలంగాణ నీటి వివాదాలపై బీజేపీ తన స్టాండ్ చెప్పాలని పొన్నం కోరారు. కాగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు మంత్రి పొన్నం తెలిపారు.