
- ఈ చట్టం పేదలకు చుట్టంలా పని చేస్తుంది: భట్టి
- జూన్ 20 వరకు ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు
- బీఆర్ఎస్ హయాంలో భూమి లేకున్నా పాస్ బుక్కుల్లోకి ఎక్కించారని ఫైర్
- ఖమ్మం జిల్లా ములుగుమాడులో భూ భారతి సర్వే, రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన భట్టి, పొంగులేటి, తుమ్మల
- నాట్లకు ముందే రైతు భరోసా పైసలు జమ: తుమ్మల
- పంద్రాగస్టుకల్లా భూ సమస్యలన్నీ పరిష్కారం: పొంగులేటి
ఖమ్మం/ఎర్రుపాలెం, వెలుగు: భూ భారతి చట్టాన్ని దేశానికే తలమానికంగా రూపొందించామని, ఈ చట్టం పేద ప్రజలకు చుట్టంగా పని చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూ భారతి సర్వే, రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి భట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నక్షలు లేకుండా రాష్ట్రంలో 413 గ్రామాల్లో దశాబ్దాలుగా పాలన సాగుతోందని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడుతున్నారని అన్నారు. ఈ గ్రామాల ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సర్వే చేయించి, సరిహద్దులను నిర్ణయించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ములుగుమాడు సహా ఐదు గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు. భూ భారతి చట్టం కింద ప్రతి సంవత్సరం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూమి అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలను అప్ డేట్ చేస్తామన్నారు. భూ రికార్డులను మాన్యువల్ గా పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తామన్నారు.
భూములు లేకున్నా.. పాస్ బుక్కుల్లోకి ఎక్కించారు..
గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల అనేక సమస్యలు వచ్చాయని భట్టి విమర్శించారు. భూమి లేకపోయినా పట్టాదారు పాస్ బుక్కుల్లోకి ఎక్కించారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు వాళ్లకు కావాల్సిన వ్యక్తులకు భూములు కట్టబెట్టి.. దాన్ని సవరించే అవకాశం లేకుండా ధరణిని తెచ్చారన్నారు. పది ఎకరాల భూమి ఉంటే17 ఎకరాలకు పాస్ బుక్కులు ఇచ్చారన్నారు. భూములు లేకుండానే వందల ఎకరాలకు పాస్బుక్లు ఇచ్చారని ఆరోపించారు. గతంలో భూమి శిస్తు కట్టేటప్పుడు రైతులు తమ భూముల వివరాలను చెక్ చేసుకునే సౌలభ్యం ఉండేదని, ధరణి వల్ల అలాంటి అవకాశం పోయిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 26 లక్షల ఎకరాలను పేదలకు అసైన్డ్ చేయగా.. ఆ భూములను ధరణిలో పార్ట్ బీలో పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు.
వారిలో అర్హులైనవారికి భూ భారతి ద్వారా పట్టాలు ఇస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. భవిష్యత్తులో అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి మిగులు భూముల పంపిణీ చేపడతామన్నారు. ప్రజలు తమ భూ సమస్యలపై కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రెవెన్యూ అధికారుల దగ్గరే పరిష్కరించుకునేలా అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ ముజమిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే భూ భారతి: తుమ్మల
రాష్ట్రంలో కొన్ని చోట్ల తక్కువ భూమి ఉన్నా పాస్బుక్కుల్లో ఎక్కువ చూపించారని, ఇలా పాస్ బుక్కుల్లో వేలాది ఎకరాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం మీద భారం పడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. భూ వివాదాల వల్ల అన్నదమ్ములు, స్నేహితుల మధ్య కొట్లాటలు జరిగి హత్యల వరకు వెళ్తోందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందన్నారు. పైలెట్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, వేగవంతంగా సర్వే చేసి ఖచ్చితమైన రికార్డులు తయారు చేస్తామన్నారు. భూముల రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు రైతులు, భూ యాజమానుల నుంచి టోకెన్ అమౌంట్ తీసుకోవాలని సూచించారు. వరి నాట్లకు ముందే రైతు భరోసా నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన ప్రకటించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: పొంగులేటి
ధరణి వల్ల రైతులు పడిన ఇబ్బందులు తొలగించేందుకు కాంగ్రెస్ సర్కారు 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను స్టడీ చేసి భూ భారతి చట్టాన్ని తెచ్చిందని మంత్రి పొంగులేటి అన్నారు. భూ భారతి అమలు కోసం ముందుగా నాలుగు మండలాలను, రెండో విడతలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసి సదస్సులు నిర్వహించామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి జూన్ 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఆగస్టు15 నాటికి రాష్ట్ర ప్రజల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలోని 413 గ్రామాలలో సరైన భూ రికార్డులు, నక్షలు లేవని, వీటిలో 5 గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ క్రింద చేపట్టి దేశంలోని 5 ప్రముఖ సంస్థల ద్వారా సర్వే చేస్తున్నామని తెలిపారు. వీటిలో ములుగుమాడు గ్రామం కూడా ఉందన్నారు. డ్రోన్, డీజీపీఎస్ వంటి ఆధునిక పద్ధతులను వినియోగించి కొలతలలో ఎటువంటి పొరపాటు లేకుండా పకడ్బందీగా నక్ష తయారు చేస్తామన్నారు. గతంలో పేదలకు పంచిన అసైన్డ్ భూములను ధరణి పేరుతో తారుమూరు చేశారని, వీటిలో జరిగిన అక్రమాలను కూడా పరిశీలిస్తామన్నారు.
అసైన్డ్ భూములపైనా పూర్తి హక్కులు ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండే విధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని పొంగులేటి తెలిపారు. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా
3, 556 మంది రెవెన్యూ అధికారులను నాలుగు రోజుల్లో నియమిస్తామన్నారు.