
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగుచేస్తూ అభివృద్ధి చేస్తున్నం: మంత్రి పొంగులేటి
- నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణమే టార్గెట్ పెట్టుకున్నామని వెల్లడి
పెద్దపల్లి, వెలుగు: ధనిక రాష్ట్రమైన తెలంగాణను గత బీఆర్ఎస్ సర్కార్ అప్పుల పాలు చేసిందని, పదేండ్లు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. వచ్చే నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మిస్తామని తెలిపారు.
శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో పోలీసు స్టేషన్, పెద్దపల్లిలో రూరల్, ట్రాఫిక్, మహిళా పోలీసు స్టేషన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత సర్కార్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, అయినా తాము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ అమలు చేసిన ధరణి వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, వీటికి పరిష్కారం చూపేందుకే భూ భారతి చట్టం చేశామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులు కృషి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.