
- ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ విడతలో స్కీమ్ వర్తింపు
- సౌర విద్యుత్, బోర్ తవ్వకం, డ్రిప్ తదితర సౌకర్యాల కల్పన
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం18,254 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ భూములు
కామారెడ్డి, నిజామాబాద్, వెలుగు : గిరిజనులకు గతంలో కేటాయించిన ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూముల అభివృద్ధికి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందిర సౌర గిరి జల వికాసం స్కీమ్తో ఐదేండ్లలో బీడు భూములు సస్యశ్యామలమయ్యేలా ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ విడతలో (ఈ ఆర్థిక ఏడాది) 1,431 ఎకరాల్లో ఇందిర సౌర గిరి జల వికాసం స్కీమ్ వర్తింపజేయనున్నారు. జూన్ లో లబ్ధిదారులనూ ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు కానున్నాయి.
ఒకప్పుడు ఫారెస్ట్ఏరియాలకు సమీపంలోని గిరిజనులు ఎలాంటి హక్కులు లేకుండానే పోడు భూములను వర్షాధారంగా సాగు చేపట్టేవాళ్లు. 2006లో అప్పటి ప్రభుత్వం ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) కింద ఉమ్మడి జిల్లాలో మొత్తం 18,254 ఎకరాలకు పట్టాలు ఇచ్చింది. కామారెడ్డి జిల్లాలో 13,346 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 4,908 ఎకరాలు ఉంది. ప్రధానంగా గాంధారి, మాచారెడ్డి, సదాశివనగర్, రామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట, బిచ్ కుంద, జుక్కల్, సిరికొండ, భీమ్గల్, చందూర్, వర్ని, కమ్మర్పల్లి, ఇందల్వాయి, రుద్రుర్, మోపాల్ మండలాల్లో గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు.
ఫారెస్ట్ ఏరియాల్లో భూములు ఉండటంతో కరెంట్ సౌకర్యం లేదు. పోడు భూముల అభివృద్ధి కోసం సౌర విద్యుత్ అందించడం, బోర్ తవ్వకం, ఉపాధి హామీ స్కీమ్ ద్వారా భూముల చదును, వ్యవసాయ, హార్టికల్చర్ శాఖల ద్వారా డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాస్థాయిలో చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా అడిషనల్ కలెక్టర్, డీఆర్డీవో, జిల్లా గిరిజన అధికారి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి, జిల్లా ఫారెస్ట్ అధికారి, విద్యుత్ఎస్ఈ, అగ్రికల్చర్, హార్టికల్చర్, జిల్లా పంచాయతీ అధికారి, రెడ్కో అధికారి ఉంటారు. మండల స్థాయిలో చైర్మన్గా ఎంపీడీవో, సభ్యులుగా ఆయా శాఖల అధికారులు ఉంటారు.
ఏమి చేస్తారంటే..
సోలార్ పంపు సెట్, బోరు మోటర్, సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ స్కీమ్లో సాగుకు యోగ్యంగా భూమిని మార్చడం, వ్యవసాయ, హార్టికల్చర్ శాఖల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం, పంటల సాగుకు సూచనలు, విత్తనాలు అందించనున్నారు.
ఫస్ట్ విడతలో..
ఫస్ట్ విడతలో ఈ ఏడాది కామారెడ్డి జిల్లాలో 309 మంది లబ్ధిదారులకు సంబంధించి 850 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 211 మంది లబ్ధిదారులకుసంబంధించి 581 ఎకరాల్లో ఇందిర సౌర గిరి జల వికాస్ స్కీమ్ అమలు చేస్తారు. ఒక లబ్ధిదారుడికి రెండున్నర ఎకరాల భూమి అభివృద్ధి చేస్తారు. ఒక రైతుకు రెండున్నర ఎకరాలు లేకపోతే జాయింట్గా ఇద్దరు లేదా ముగ్గురు రైతులను కలిపి స్కీమ్ అమలు చేస్తారు.
ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా స్కీమ్ వర్తింపు
ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో స్కీమ్ వర్తింపజేస్తాం. జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను గుర్తిస్తాం. జూన్ లో కార్యచరణ చేపడుతాం.
రజిత, జిల్లా గిరిజన ఇన్చార్జి అధికారి, కామారెడ్డి