
- బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు
- మహిళల హక్కులపై పోరాడే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటాం
- మేధోమథన సదస్సులో మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ టీచర్లతో టీనేజ్ అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తామని మహిళా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. బాలికల రక్షణ కోసం బాలికలతోనే స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వారితో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ స్వచ్ఛంద సంస్థలతో త్వరలోనే సమావేశం నిర్వహించి మహిళ భద్రత కోసం గైడ్ లైన్స్ రూపొందిస్తామని సీతక్క ప్రకటించారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో కొనసాగుతున్న మేధో మథన సదస్సు ముగింపు సమావేశానికి మంత్రి సీతక్క అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వివిధ జిల్లాల్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అప్పుడే పుట్టిన బిడ్డలను చాలా చోట్ల ముళ్ల పొదలు, చెత్తకుప్పల్లో వదిలేసి వెళుతున్నారని, ఇది చాలా బాధాకరమని, చీమలు, కుక్కలు, చెత్త, ముండ్ల మధ్య శిశువుల ప్రాణాలు పోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఊయలలను ఏర్పాటు చేస్తామని, బిడ్డలను పారేయకుండా.. ఆ ఊయలలో వదిలేస్తే వారి బాధ్యతను తామే స్వీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
రాష్ర్టం ఏర్పాటైయి10 ఏండ్లు అయినా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్ట రూల్స్ను అడాప్ట్ చేసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో మహిళా శిశు సంక్షేమం పై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు తమ విలువైన సలహాలు ఇచ్చారన్నారు. బాల్యవివాహల వల్ల జరిగే నష్టాలపై గ్రామసభలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క సూచించారు.