కోల్కతా: వెస్ట్ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గ రీ పోలింగ్కు రెండు రోజుల ముందే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఫాల్తా రీ పోలింగ్ రేసు నుంచి తప్పుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. పోటీ నుంచి తప్పుకోవడానికి స్పష్టమైన కారణమేంటో చెప్పకపోవడంతో జహంగీర్ ఖాన్ తీరు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, ఎన్నికకు ముందే చేతులేత్తేసిన జహంగీర్ ఖాన్పై అధికార బీజేపీ సెటైర్లు వేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జహంగీర్ ఖాన్ పలికిన భారీ సినీ డైలాగులే. మరీ జహంగీర్ ఖాన్ ఏం డైలాగులు వేశారు.. చివరకు ఎందుకు వెనక్కి తగ్గారో తెలుసుకుందాం..
జహంగీర్ ఖాన్ ఏమన్నారంటే..?
2026, ఏప్రిల్ 29న బెంగాల్ అసెంబ్లీ రెండో దశ పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్గా పేరున్న యూపీ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ పాల్ శర్మను బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా ఈసీ నియమించింది. దీంతో సమస్యాత్మక ప్రాంతమైన ఫాల్తా నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అజయ్ పాల్ శర్మ కీలక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఫాల్తా టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటికి వెళ్లి ఓటర్లను బెదిరించకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని అజయ్ పాల్ శర్మ కోరారు.
అయితే, అజయ్ పాల్ శర్మపై జహంగీర్ ఖాన్ ఫైర్ అయ్యారు. ‘‘అజయ్ పాల్ శర్మ సింగం అయితే.. నేను పుష్ప.. ఫాల్తా నా అడ్డా’’ అంటూ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా డైలాగులు వేశాడు జహంగీర్ ఖాన్. ఇక, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి.. బీజేపీ ఘన విజయం సాధించింది.. టీఎంసీ చిత్తుగా ఓడిపోయింది.
►ALSO READ | పెట్రోల్పై మరో 17 రూపాయలు.. బంగారంపై GST పెంచాలి: కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సూచన
ఇక, ఫాల్తా నియోజకవర్గంలో పోలింగ్లో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు ఫాల్తా నియోజకర్గంలో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. 2026, మే 23న ఫాల్తాలో రీ పోలింగ్ జరగనుంది. ఎన్నికకు రెండు రోజుల ముందే టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫాల్తా రీ పోలింగ్లో పోటీ చేయబోనని ప్రకటించాడు. దీంతో జహంగీర్ ఖాన్పై సీఎం సువేందు అధికారి సెటైర్లు వేశారు.
పుష్పా ఝుక్ గయా..? (పుష్ప భయపడ్డాడా..?) అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు పుష్ప ఝుకేగా నహీ (తలవంచను) అని అన్నారు.. కానీ ఇప్పుడు పుష్ప ఇక్కడ లేరని చమత్కరించారు. ఎలాగూ పోటీ చేసిన గెలవమని తెలిసే పుష్ప ముందే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారని విమర్శించారు. పాపం పుష్ప కుంగిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ కుట్రలో భాగంగానే జహంగీర్ ఖాన్ ఫాల్తా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారని టీఎంసీ వాదిస్తోంది.
