
- ఆ నీటిని ఆంధ్రాకు తాకట్టు పెట్టిందే కేసీఆర్: మహేశ్ కుమార్ గౌడ్
- స్థానిక ఎన్నికలపై మంత్రులు సహా పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ అనవసరమైన ఆరోపణలు చేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నీళ్లపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని, ఆ నీటిని ఆంధ్రాకు తాకట్టు పెట్టిందే కేసీఆర్ అని ఆరోపించారు. ఏపీ వెళ్లి చేపల పులుసు, బిర్యానీ తిని తెలంగాణ వాటాను ఆంధ్రాకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. గతాన్ని మరిచి, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు గోదావరి, కృష్ణా నదీ జలాల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
లోకల్ బాడీ ఎన్నికలు కోర్టుతో ముడిపడి ఉన్న అంశమని, తీర్పు వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి, ఆ వర్గాలకు తగిన న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. దీనిపై మంత్రులతో సహా పార్టీ నేతలు ఎవరు మాట్లాడొద్దని కోరారు. దీనిపై త్వరలోనే పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత కొండామురళి వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, వీటిని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి ఉప ఎన్నికలు వస్తే చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే, ఆ సీటును వారికే వదిలేసే వారని, కానీ అలాంటి సంప్రదాయానికి కేసీఆర్ చెక్ పెట్టారన్నారు.