
సికింద్రాబాద్, వెలుగు: చిట్టీల పేరుతో పలువురిని మోసం చేసి రూ.3 కోట్లు కొట్టేసిన ఇద్దరిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాల గణపురానికి చెందిన మహేశ్వరం సత్యనారాయణ(73), అతడి కొడుకు మోహన్(43) ఇద్దరూ సిటీకి వచ్చి మల్కాజిగిరిలోని ఇందిరానెహ్రూనగర్ లో ఉంటున్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా చిట్టీల బిజినెస్ మొదలుపెట్టారు. స్థానికంగా ఉన్న పలువురిని నమ్మించి చిట్టీ కట్టమని చెప్పి డబ్బులు తీసుకున్నారు.
సుమారు 115 మంది రూ. లక్ష నుంచి రెండున్నర లక్షల చొప్పున వీరి వద్ద చిట్టీలు కట్టారు. జల్సాలకు బానిసైన తండ్రీకొడుకు మొత్తం చిట్టీ పైసలు రూ. 2 కోట్లను తమ సొంత అవసరాలకు వాడుకున్నారు. కొన్నిరోజుల తర్వాత బాధితులకు రెస్పాన్స్ ఇవ్వడం మానేశారు. బాధితులకు చెందిన మిగతా డబ్బు రూ.93 లక్షల 56 వేలను తీసుకుని పరారయ్యారు. దీంతో బాధితులు మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యనారాయణ, మోహన్ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.