వెటరన్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి కన్నుమూత

వెటరన్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి కన్నుమూత
  • వృద్ధాప్య సమస్యలతో అమెరికాలో మృతి
  • జర్నలిస్టుగా 70 ఏండ్ల సుదీర్ఘ కెరీర్
  • దక్కన్ క్రానికల్, డైలీ న్యూస్, ఇండియన్ ఎక్స్ ప్రెస్, 
  • టైమ్స్ ఆఫ్ ఇండియాలో వివిధ హోదాల్లో సర్వీస్

న్యూఢిల్లీ: వెటరన్  జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి (99) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో అమెరికాలోని న్యూజెర్సీలో ఓ హాస్పిటల్ లోచికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30 గంటలకు ఆయన చనిపోయారని దాసు తమ్ముడు, ద హిందూ పత్రిక మాజీ రెసిడెంట్  ఎడిటర్  దాసు కేశవరావు తెలిపారు. కృష్ణమూర్తి జర్నలిస్టు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 1954–55లో ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం ఫస్ట్  బ్యాచ్ కు చెందిన వారు. ఇంటర్నీగా టైమ్స్ ఆఫ్  ఇండియాలో పనిచేశారు. తర్వాత ద సెంటినెల్ లో తన కెరీర్ ను ప్రారంభించారు.

 దక్కన్  క్రానికల్, డైలీ న్యూస్, ఇండియన్  ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్​ ఇండియాలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1959లో విజయవాడలో ఇండియన్  ఎక్స్ ప్రెస్  బ్రాంచ్ ను స్థాపించడంలో కృషి చేశారు. అహ్మదాబాద్  లోని టైమ్స్ ఆఫ్  ఇండియాలో పనిచేశాక 1969లో ఢిల్లీకి మారారు. అక్కడ పేట్రియట్ దినపత్రికలో దాదాపు 20 ఏండ్లు పనిచేశారు. ఆ సమయంలో వైవిధ్యమైన పేజీ లేఔట్ తో డెస్క్ మ్యాన్ గా పేరు పొందారు. 

రిటైర్  అయ్యాక ఢిల్లీలోని ఇండియన్  ఇన్ స్టిట్యూట్ ఆఫ్​  మాస్  కమ్యూనికేషన్ లో అసోసియేట్  ప్రొఫెసర్ గా చేశారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్  హైదరాబాద్, ఓయూ, ఆంధ్రా ఓపెన్​ వర్సిటీ, భవన్స్  కాలేజ్  ఆఫ్  జర్నలిజంలో బోధించారు. 2001లో అమెరికాకు వలస వెళ్లాక రచనలు చేయడం ప్రారంభించారు. 2024లో ఉస్మానియా వర్సిటీ కృష్ణమూర్తిని లైఫ్ టైం అచీవ్ మెంట్  అవార్డుతో సత్కరించింది.