- ప్రెగ్నెన్సీ లేకుం డానే పాలిచ్చేలా చేస్తం
- ఎంబ్రియోల ద్వారా మేలురకం ఆవులు
- ట్యాగ్ కో-ఫౌండర్ ఆలూరి శ్రీనివాసరావు
హైదరాబాద్, వెలుగు: మనదేశంలో మేలురకం జాతి ఆవులు చాలా ఉన్నా, సరైన జెనెటిక్స్ లేకపోవడం వల్ల పాడిపరిశ్రమ రైతులు ఎంతో నష్టపోతున్నారని లైవ్స్టాక్ స్టార్టప్ ట్రాపికల్ ఏనిమల్ జెనెటిక్స్ (ట్యాగ్) కో–ఫౌండర్ ఆలూరి శ్రీనివాస రావు అన్నారు. తమ టెక్నాలజీల ద్వారా మేలురకం జాతి ఆవులను పుట్టించవచ్చని, పాల దిగుమతిని పెంచవచ్చని అన్నారు. వట్టిపోయిన ఆవులనూ పాలిచ్చేలా చేయవచ్చని ‘వెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వివరాలన్నీ ఆయన మాటల్లోనే...
మనదేశంలో పాల దిగుబడి చాలా తక్కువ..
సరైన జెనెటిక్స్ లేకపోవడంతో మనదేశంలో ఆవులు చాలా తక్కువగా పాలిస్తున్నాయి. ఇండియాలోనూ పాడి రైతుల ఇన్కమ్ పెంచే టెక్నాలజీని డెవలప్ చేయడానికి మేం ఐదేళ్ల క్రితం ట్యాగ్ను స్థాపించాం. మేలుజాతి ఆవులను పుట్టించడానికి ఎంబ్రియో టెక్నాలజీని వాడుతాం. నేషనల్ డెయిరీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్డీబీటీ)కి చెందిన ఎద్దుల వీర్యాన్ని, ఆవుల అండాలను సేకరించి ఎంబ్రియోలను (పిండాలను) తయారు చేస్తాం. వీటిని రైతు ఆవు గర్భంలో ప్రవేశపెడతాం. ఆవు ఈనిన తరువాత చాలా ఎక్కువ పాలిస్తుంది. సాధారణ ఆవు రెండు లీటర్ల పాలిస్తే.. ఎంబ్రియో టెక్నాలజీ ద్వారా పాల దిగుబడిని రెట్టింపు చేయవచ్చు. సెక్స్ సెపరేషన్ టెక్నాలజీ ద్వారా పెయ్యను పుట్టించవచ్చు. ఇందుకు 90 శాతం గ్యారంటీ ఇస్తాం. ఈ టెక్నాలజీని మేం ఎన్డీబీటీకి అమ్మాం. ఏ గోవు జాతి అయినా మేం ఎంబ్రియోస్ తయారు చేసి ఇస్తాం. త్వరలో రిటైల్ డిస్ట్రిబ్యూటర్లను, చానెల్ పార్ట్నర్ల నుంచి ఎంబ్రియోలు కొనుక్కోవచ్చు. ఒక్కో ఎంబ్రియో ధర రూ.30 వేల వరకు ఉంటుంది.
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎంబ్రియో ల్యాబ్లు
మాకు ఇప్పుడు గుజరాత్, కర్నాటకలో ఎంబ్రియో ల్యాబ్లు ఉన్నాయి. త్వరలో తెలుగు రాష్ట్రాలతోపాటు 20 చోట్ల ల్యాబ్లు ఏర్పాటు చేస్తాం. గత ఐదేళ్ల నుంచి రూ.85 కోట్లు సేకరించాం. రెండు నెలల్లో సిరీస్ ఏ రౌండింగ్ ద్వారా రూ. 73 కోట్లు
సేకరిస్తాం.
ప్రెగ్నెన్సీ ఫ్రీ ల్యాక్టేషన్
వట్టిపోయిన ఆవులను ప్రెగ్నెన్సీ ఫ్రీ ల్యాక్టేషన్ ద్వారా పాలిచ్చేలా మేం చేస్తాం. గర్భం లేకుండానే ఆవు బాలింత అవుతుంది. హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చాక పాలివ్వడం మొదలవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ టెక్నాలజీని జూన్లో లాంచ్ చేస్తాం. ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.మూడు వేల వరకు ఉంటుంది. ఆవు ఏడాదికి 1,500 లీటర్ల పాలిస్తే.. ఈ టెక్నాలజీ ద్వారా నాలుగు వేల లీటర్ల పాలిస్తుంది. అంతేగాక త్వరలో గావ్స్కోప్ అనే డివైజ్ను లాంచ్ చేస్తాం. కెమెరా ఎయిడెడ్ గన్తో టెక్నీషియన్స్ ఆవు శరీరంలోకి వీర్యాన్ని పంపిస్తారు.