మొక్కుబడిగా హాస్పిటల్స్ .. ఆర్ఎంపీ క్లీనిక్​ల తనిఖీలు

మొక్కుబడిగా  హాస్పిటల్స్ .. ఆర్ఎంపీ క్లీనిక్​ల తనిఖీలు
  • పట్టింపులేని ఉన్నతాధికారులు
  • పర్యవేక్షణ లేక బృందాల ఇష్టారాజ్యం

జనగామ, వెలుగు: వైద్యారోగ్య శాఖ అధికారుల తనిఖీలన్నీ మొక్కుబడిగానే సాగుతున్నాయి. ప్రైవేటు హాస్పిటల్స్, ఆర్​ఎంపీ ఫస్ట్​ ఎయిడ్ క్లీనిక్​ల వైద్య సేవల్లోని అక్రమాలను వెలికితీయాలనే లక్ష్యంతో జనగామ జిల్లాలో వారం రోజులుగా ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు అంతా తూతూ మంత్రంగానే సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆఫీసర్లు వారు ఉన్న చోటుకే ఆర్​ఎంపీలను పిలిపించుకుని తనికీ చేసినట్లు రాసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో తనిఖీల బృందాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.  

ఓవైపు జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ట్రీట్​ మెంట్ పేరిట పేషెంట్లను ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదులు కూడా ఎక్కువే. ఇక ఆర్​ఎంపీలు మరింత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ఆర్​ఎంపీ క్లీనిక్ డ్రగ్ ఇన్​స్పెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆర్​ఎంపీల దందాపై ఆఫీసర్లు నజర్ పెట్టి తనిఖీలకు దిగారు. 

వారం రోజులుగా తనిఖీలు..

జిల్లాలో సుమారు 46 హాస్పిటల్స్, 54 క్లీనిక్​లు, ఆరు ల్యాబ్​లు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అనుమతి లేనివి కూడా మరికొన్ని ఉన్నాయి. వీటిలోని అవకతవకలను బయటపెట్టేందుకు డీఎంహెచ్ వో హరీశ్​రాజ్ 5 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. వీటిని ప్రోగ్రాం ఆఫీసర్లు మహేందర్, రవీందర్ గౌడ్, డిప్యూటీ డీఎంహెచ్​ఓ శ్రీదేవి, సుధీర్, సివిల్ సర్జన్ పీఎస్ మల్లికార్జున్ సారథ్యం వహిస్తున్నారు. ఒక్కో బృందంలో 8 మంది స్టాఫ్​ ఉన్నారు. సుమారు 15 రోజుల్లో తనిఖీలు కంప్లీట్​ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సగం తనిఖీలు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. 

తూతూ మంత్రంగానే.. 

తనిఖీ బృందాలు హాస్పిటల్స్ కు నేరుగా వెళ్లి తనిఖీలు చేస్తున్నాయి. ప్రధానంగా రెన్యువల్, వేస్ట్ మేనేజ్​మెంట్, ఫైర్ సేఫ్టీ, ఆపరేషన్ థియేటర్, లేబర్​ రూం తదితర మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. చెక్ లిస్ట్ తీసుకెళ్లి నివేదిక తయారు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఊరికి కనీసం ఇద్దరు ముగ్గురు ఆర్ఎంపీలు ఉన్న నేపథ్యంలో వారు అనధికారికంగా నడుపుతున్న క్లీనిక్​ల పై బృందాలు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

కానీ, ఓ బృందంలోని డాక్టర్ జనగామలోని తన హాస్పిటల్​కు ఆయన పనిచేసే మండలానికి చెందిన ఆర్​ఎంపీలను పిలిపించుకుని తనిఖీలు చేసినట్లు ధృవీకరణ పత్రాలు అందించడం విమర్శలకు దారితీస్తోంది. సదరు ఆర్​ఎంపీల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. దీంతో తనిఖీల్లోని డొల్లతనం బయటపడుతోంది. ఇప్పటికైనా తనిఖీలను సరైన పద్ధతిలో నిర్వహించాలని, ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని వైద్య వర్గాలు, ప్రజలు కోరుతున్నారు.