ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • మంత్రి సత్యవతి రాథోడ్​

ములుగు, ఏటూరునాగారం, వెలుగు: గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ములుగులో గట్టమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్న మంత్రి.... జిల్లా పరిషత్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్​తో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం గిరిజన కళాకారులతో కలిసి డాన్సులు చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్  మాట్లాడుతూ... గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు.

ప్రజల బాధలు తెలిసిన అపరభగీరథుడు అని కొనియాడారు. ములుగులో మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, మినీ స్టేడియం నిర్మాణ పనులు పురోగతిలోనే ఉన్నాయని చెప్పారు. త్వరలోనే వాటిని పూర్తి చేస్తామన్నారు, కార్యక్రమంలో జడ్పీటీసీలు సకినాల భవాని, రుద్రమదేవి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోరిక గోవింద్ నాయక్, మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్ ఉన్నారు.

హెల్త్, డయాలసిస్ సెంటర్ సేవలు షురూ..

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో 50 పడకల హెల్త్ సెంటర్, వివిధ రకాల పరీక్షలు చేసే డయాలసిస్ సెంటర్ ను శనివారం మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. రూ.7కోట్లతో వీటిని ఏర్పాటు చేయగా.. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎమ్మెల్యే సీతక్క, ఐటీడీఏ పీవో అంకిత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకే వీటిని నెలకొల్పామన్నారు. ప్రజలు ప్రభుత్వాసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, సీఈవో ప్రసూనారాణి, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పళ్ళ బుచ్చయ్య, డీపీవో వెంకయ్య తదితరులున్నారు.

మోడీ హయాంలోనే దేశాభివృద్ధి

వరంగల్ సిటీ, వెలుగు: భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతోందని బీజేపీ పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి సీహెచ్​విఠల్ అన్నారు. శనివారం సిటీలోని కొత్తవాడ పద్మశాలి హాల్​లో నిర్వహించిన మేధావుల సదస్సుకు ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దు నుంచి డిజిటల్ ఇండియా వరకు ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కరోనా టైంలో 200 కోట్ల టీకాలను ఉచితంగా అంధించిన ఘటత మోడీకే దక్కుతుందని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, కుసుమ సతీశ్​బాబు, విజయ్​ చందర్​రెడ్డి, అశోక్​రెడ్డి, సమ్మిరెడ్డి, సరోత్తం రెడ్డి, చంద్రశేఖర్, ప్రభాకర్ తదితరులున్నారు.

వృద్ధులకు అండగా ఉంటాం

భూపాలపల్లి అర్బన్, జనగామ అర్బన్, వెలుగు: వృద్ధులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భూపాలపల్లి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కె. శ్యామూల్ అన్నారు. శనివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో వృద్ధులను సన్మానించారు. పెన్షన్, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, ఆస్తి గొడవలు, మానసిక రుగ్మతలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా వృద్ధులు తమను సంప్రదించాలన్నారు. అనంతరం అమృత వర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులను అభినందించారు. జనగామ జిల్లాకేంద్రంలోనూ కలెక్టర్ శివలింగయ్య వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కేసీఆర్ ను కలిసిన గండ్ర

భూపాలపల్లి అర్బన్, వెలుగు: వరంగల్ కు వచ్చిన సీఎం కేసీఆర్ ను శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనులు, ప్రజల బాగోగులను కేసీఆర్ తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ బుర్ర రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్ రెడ్డి, గణపురం మండల పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మి నరసింహారావు, మాజీ ఎంపీపీ రఘుపతి రావు, జిల్లా నాయకులు సెగ్గెం సిద్దు ఉన్నారు.

అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు

నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్​లో తలపెట్టిన వివిధ అభివృద్ధి పనులకు కౌన్సిల్​ఆమోదం తెలిపిందని మున్సిపల్​ చైర్​ పర్సన్​ గుంటి రజనీ కిషన్  వెల్లడించారు. దసరా ఉత్సవాలకు రూ.16లక్షలు..  ప్రచార ఖర్చులు, మాధన్నపేట రోడ్ వైడనింగ్ మాస్టర్ ప్లాన్ కోసం రూ.29,500.. మాధన్నపేట పెద్ద కాలువ పూడికతీత కోసం రూ.4.99లక్షలు, చెత్త డంపింగ్​ కోసం రూ,4.99లక్షలతో పాటు మరో 16 డెవలప్​మెంట్​ పనులకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు.

కన్నుల పండువగా కల్యాణ బతుకమ్మ వేడుకలు

నర్సంపేట, వెలుగు: నర్సంపేటలో శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి, పెద్ది స్వప్న దంపతుల ఆధ్వర్యంలో మార్కెట్​యార్డులో జరిగిన ‘కల్యాణ బతుకమ్మ’ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. దాదాపు మూడు వేల మంది మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం 700 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 10,300 మందికి కల్యాణలక్ష్మి అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వేడుకల్లో నర్సంపేట మున్సిపల్​ చైర్​ పర్సన్​ గుంటి రజనీ కిషన్​, కౌన్సిలర్లు దార్ల రమాదేవి, బానాల ఇందిర తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరల్లో అవినీతి

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ చీరల పంపిణీలోనూ రూ.300కోట్ల అవినీతికి పాల్పడిందని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్​నాయక్​ ఆరోపించారు. శనివారం బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 50 రూపాయల చీరను, 1888 రూపాయలకు కొన్నట్లు లెక్కల్లో చూపారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై సర్వే చేశాకే కేంద్రం నో చెప్పిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రయ్య, బీజేపీ లీడర్లు రాంబాబు, సంపత్, సందీప్​, నవీన్, బిందుభారతి, భరత్​, లక్ష్మణ్​నాయక్​ తదితరులు ఉన్నారు. అంతకుముందు యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు.