
- గవర్నర్, సీఎం సూచనల మేరకు ఇండ్లు కేటాయిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సొంత ఇండ్లకు నోచుకోని ఆదిమ, గిరిజన తెగలలోని చెంచులకు 10 వేల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, మన్ననూరు, ఏటూరు నాగారంలో నాలుగు ఐటీడీఏల పరిధిలో 10 వేల కుటంబాలను గుర్తించామని, వీరందరికి ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై మంగళవారం సెక్రటేరియెట్లో ఆయన రివ్యూ చేపట్టారు. ట్రైబల్ ఏరియాల్లో ఇళ్లు ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం ప్రభుత్వానికి సూచించారని, ఆయన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై సూచనలు చేశారన్నారు.
చెంచులు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం కూడా ఇలా ఆలోచన చేయలేదని పేర్కొన్నారు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఆసిఫాబాద్ లో 3551, బోధ్ లో 695, ఖానాపూర్ లో 1802, సిర్పూరులో 311, అదిలాబాద్ లో1430, బెల్లంపల్లిలో 326, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అశ్వారావుపేటలో 105, మున్ననూరు చెంచు స్పెషల్ ప్రాజెక్టు కింద అచ్చంపేటలో 518, మహబూబ్నగర్ లో 153, పరిగిలో 138, తాండూరులో 184 మొత్తం 9,395 ఇండ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి వివరించారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు
ఈ ఏడాది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్ కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి హైదరాబాద్లో ఉన్న పేదలకు కేటాయిస్తే వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రాంతంలోనే జీ ప్లస్ త్రీ పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మించాలని భావిస్తున్నామని మంత్రి వివరించారు.