- ఫ్యామిలీ మెంబర్స్ కంటే ముందే కోలుకున్నడు
న్యూఢిల్లీ: కంటికి కనిపించని ఈ మహమ్మారి ముసలోళ్లకి, చిన్నపిల్లలకి సోకితే డేంజర్ అని డాక్టర్లు హెచ్చరిస్తుండగా.. ఢిల్లీకి చెందిన 106 ఏళ్ల ముసలాయన వ్యాధి నుంచి కోలుకున్నడు. 70 ఏండ్ల తన కొడుకు కంటే తొందరగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిండు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఆర్జీఎస్ఎస్హెచ్)లో చేరిన ఆ పేషంట్కు వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ తొందరగా రికవరి అయ్యారని హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. ఆ ముసలాయనకు 4 ఏళ్లు ఉన్నప్పుడు ప్రపంచంలో దాదాపు 40 మిలియన్ల మందిని పొట్టనపెట్టకున్న స్పానిష్ ఫ్లూ ప్రబలిందని, అయితే ఆయన దాని బారని పడ్డారా లేదా అనే విషయం గురించి క్లారిటీ లేదని సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు. “ ఢిల్లీలో 100 ఏళ్లు పైబడిన తర్వాత వ్యాధి సోకిన మొదటి వ్యక్తి ఈయనే. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ గురించి తెలిసి కరోనా బారినపడిన వ్యక్తి కూడా ఇతనే. ఆయన కుటుంబసభ్యులు కూడా వ్యాధి బారినపడ్డారు. కానీ వాళ్లందరికంటే ఈయనే త్వరగా కోలుకున్నారు. ఆయన రెండు మహమ్మారిలు ఉన్న కాలంలో బతికారు” అని సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు.