
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం ఒక్క రోజే 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన మతప్రార్థనల్లో పాల్గొన్న వారేనని, వారి కుటుంబసభ్యులు, సన్నిహితులేనని ఏపీ సర్కార్ ప్రకటించింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 44 మాత్రమే. కానీ.. మంగళవారం రాత్రి 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు అంటే 12 గంటల వ్యవధిలో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 43 కేసులన్నీ ఢిల్లీ మర్కజ్ రిలేటెడ్వేనని ఏపీ సర్కార్ బులెటిన్లో పేర్కొంది. రాత్రి 7 గంటలకు మరో బులెటిన్ను కూడా విడుదల చేసింది. అందులో 24 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంటే బుధవారం ఒక్కరోజే ఏపీలో మొత్తం 67 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కు చేరుకుంది. ఈ మొత్తం కేసుల్లో ఎక్కువ శాతం ఢిల్లీ మర్కజ్ రిలేటెడ్వేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెండు రోజుల్లోనే భారీగా..
సోమవారం వరకు ఏపీలో 23కే పరిమితమైన కరోనా కేసులు.. రెండు రోజుల్లోనే 111కు చేరుకున్నాయి. ఇందులో బుధవారం ఒక్కరోజే 67 నమోదయ్యాయి. తాజా కేసుల్లో బాధితులంతా ఢిల్లీ వెళ్లొచ్చిన వారు, వారి ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులే కావడంతో వారందరిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ నుంచి ఈ నెల 20, 21వ తేదీల్లో రాష్ట్రానికి వచ్చిన బ్యాచ్ ఎక్కడెక్కడ తిరిగింది? ఆ బ్యాచ్ ఎంత మందిని కలిసింది? అనే అంశాలపై ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు తిరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ టీమ్స్ థర్మల్ స్ర్కీనింగ్ టెస్ట్లు చేస్తోంది. ఢిల్లీ బ్యాచ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రకాశం, కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో కాలేజీ బిల్డింగ్స్లో ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీ వెళ్లొచ్చిన వారందరూ స్వచ్ఛందంగా కరోనా టెస్ట్లు చేయించుకుని క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి చేసింది.
రెండు జిల్లాలు తప్ప.. అంతటా
కడప 15, ప్రకాశం 15, పశ్చిమగోదావరి 14, విశాఖపట్నం 11, గుంటూరు 20, తూర్పుగోదావరి 9, చిత్తూరు 6, కృష్ణా 15, నెల్లూరు 3, అనంతపురం 2, కర్నూలు 1గా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలోని మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం కనిపించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదని పేర్కొంది.
వాళ్లే ఎక్కువన్న ఏపీ సీఎం
ఏపీలో బుధవారం ఉదయం 9 గంటల వరకు 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో 70 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మత ప్రార్థనల్లో పాల్గొన్న వారేనని, వారి రిలేటివ్సేనని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు రాష్ట్రం నుంచి 1,085 మంది హాజరైనట్లు చెప్పారు. వారిలో దాదాపు అందరికీ టెస్టులు చేశామన్నారు. ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ వచ్చాయని, మరికొన్ఇన రిపోర్ట్స్ రావాల్సి ఉందని చెప్పారు. మరో 21 మంది ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. గత 10 రోజుల్లో ఢిల్లీ వెళ్లొచ్చినవారితో కాంటాక్ట్అయినవారు కరోనా టెస్టులుచేయించుకోవాలని జగన్విజ్ఞప్తి చేశారు. కరోనాపై అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ రివ్యూ చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.