
హైదరాబాద్: వరుస ఎన్ కౌంటర్లలో అగ్ర నేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా 12 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గురువారం (జూన్ 19) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా ఎస్పీ రోహిత్, సీఆర్ఫీఎఫ్ బలగాల ముందు మావోయిస్టులు సరెండర్ అయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 12 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సీఆర్పిఎఫ్ బలగాల ఎదుట లొంగిపోయారని తెలిపారు. సరెండర్ అయిన వారిలో డివిజన్ కమిటీ మెంబర్స్ ఇద్దరు, ఏసీఎం కేడర్కు చెందిన నలుగురు, మొత్తం 12 మంది (పురుషులు 9 మంది, ముగ్గురు మహిళలు) ఉన్నారని చెప్పారు.
2025, జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ క్యాడర్లో పనిచేస్తున్న 294 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా వీరు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. సరెండర్ అయిన మావోయిస్టులకు తక్షణ సహాయం కింద రూ.25 వేల నగదు అందజేశారు.