12 అంశాలతో కాంగ్రెస్​ దళిత, గిరిజన డిక్లరేషన్​

 12 అంశాలతో కాంగ్రెస్​ దళిత, గిరిజన డిక్లరేషన్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల్లోని ఒక్కో కుటుంబానికి అంబేద్కర్​ అభయహస్తం కింద రూ. 12 లక్షలు ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని తెలిపింది. 

కాంగ్రెస్​ దళిత, గిరిజన డిక్లరేషన్​లో 12 పాయింట్లు

1. రిజర్వేషన్లు: జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతానికి రిజర్వేషన్ల పెంపు. ఎస్సీల్లో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ. 
2. అంబేద్కర్​ అభయ హస్తం: ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం
3. స్పెషల్​ రిజర్వేషన్లు: అన్ని ప్రభుత్వం కాంట్రాక్టుల్లోనూ ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం ప్రత్యేక రిజర్వేషన్ల అమలు. ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లోనూ స్పెషల్​ రిజర్వేషన్లు. 
4. ఇందిరమ్మ ఇండ్లు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు ఇండ్ల స్థలాలు. అందులో ఇల్లు కట్టుకునేందుకు రూ. 6 లక్షల ఆర్థిక సాయం
5. భూ హక్కులు: ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్​ ల్యాండ్స్​పై యాజమాన్య హక్కులను కల్పిస్తం. అసైన్డ్​ భూములకు యజమానులను చేస్తం. 
6. పోడు హక్కులు: పోడు భూములపై ఎస్టీలకు సర్వాధికారాలు. అమ్ముకోవాలన్నా, బ్యాంకులో తాకట్టు పెట్టుకోవాలన్నా పూర్తి హక్కులు గిరిజనులకే. 2006లో సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు హక్కుల పట్టాలు.
7. సమ్మక్క, సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం: ప్రతి తండా, గిరిజన గూడేలు, గిరిజన పంచాయతీలకు ఏటా రూ. 25 లక్షల నిధులు. వాటి అభివృద్ధికి సహకారం. 
8. ఎస్సీలకు కార్పొరేషన్లు: దళితుల కోసం మూడు కార్పొరేషన్ల ఏర్పాటు. మాల, మాదిగతోపాటు ఎస్సీ ఇతర ఉపకులాలకు కార్పొరేషన్లు. దళితుల అభ్యున్నతి కోసం ప్రతి కార్పొరేషన్​కు ఏటా రూ. 750 కోట్ల కేటాయింపు. 
9. ఎస్టీ కార్పొరేషన్లు: గిరిజనుల కోసం కూడా మూడు కార్పొరేషన్ల ఏర్పాటు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్​, సంత్​ సేవాలాల్​ లంబాడా కార్పొరేషన్​, ఎరుకల కార్పొరేషన్​ ఏర్పాటు. వారి అభ్యున్నతి కోసం ప్రతి కార్పొరేషన్​కు ఏటా రూ.500 కోట్లు కేటాయింపు. 
10. ఐటీడీఏలు, ఆస్పత్రులు: మైదాన ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ఐదు కొత్త ఐటీడీఏలు, 9 సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. నల్గొండ, మహబూబాబాద్​, ఖమ్మం, నిజామాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లో వాటి ఏర్పాటు. 
11. విద్యాజ్యోతి పథకం: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుల్లో మంచి ప్రతిభ కనబరిస్తే ఆర్థిక ప్రోత్సాహకాలు. పదో తరగతి పాస్​ అయితే రూ. పది వేలు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ కంప్లీట్​ చేస్తే రూ. లక్ష, ఎంఫిల్​, పీహెచ్​డీ పూర్తి చేసిన వారికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాలు,  ఇంటర్​ పాసైతే రూ.15 వేలు.
12. గురుకులాలు: ప్రతి మండలంలోనూ ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల ఏర్పాటు. వారికోసం ప్రతి మండలంలోనూ ప్రత్యేక హాస్టళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్​మెంట్​ ద్వారా అందరికీ విద్య. గ్రాడ్యుయేషన్​, పీజీ చేసే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా హాస్టల్​ సదుపాయం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం.