కుటుంబ నియంత్రణ ఘటనలో మరికొందరికి సీరియస్!

కుటుంబ నియంత్రణ ఘటనలో మరికొందరికి సీరియస్!

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ కేసుల్లో మరికొంత మందికి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం హాస్పిటల్లో 18 మందికి డాక్టర్లు టెస్టులు చేశారు. ఇందులో 12 మందికి ఇబ్బందులు ఉండటంతో నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటికే ఏడుగురిని అపోలో హాస్పిటల్ కు షిప్ట్ చేయగా..ఇందులో ఒకరు సీరియస్ గా ఉన్నారు.   

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై హెల్త్ డైరెక్టర్ వివరణ 

ఇబ్రహీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలైన ఘటనపై తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వివరణ ఇచ్చారు. 34 మంది మహిళలకు అనుభవం ఉన్న నిపుణులైన డాక్టర్లతోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించామని చెప్పారు. దురదృష్టవశాత్తు నలుగురు మహిళలు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయిస్తోందని చెప్పారు. నలుగురు మహిళలు చనిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు.

పోస్టుమార్టం రిపోర్టులు దర్యాప్తులో చాలా కీలకం

వారం రోజుల్లో దర్యాప్తు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని శ్రీనివాస్ రావు  చెప్పారు. ముఖ్యంగా చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులు కూడా దర్యాప్తులో చాలా కీలకమన్నారు. ప్రస్తుతం 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ రెగ్యూలర్ గా జరిగే ప్రక్రియని, దేశవ్యాప్తంగా ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతుంటాయని చెప్పారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ రాష్ర్ట ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. అంతేకాకుండా చనిపోయిన మహిళల పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. గత 75 సవత్సరాల నుంచి మన దేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్నాయని, కేంద్రం గైడ్ లైన్స్ తో గుర్తించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారని చెప్పారు. 2016 నుంచి ఎలాంటి టార్గెట్ లు లేవని, మహిళలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని వివరించారు.