తండ్రి కొట్టిన దెబ్బల నుండి తప్పించుకోవడానికి ఇంటి నుండి పారిపోయిన 12 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు కొరికి చంపాయి.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివారాల్లోకి వెళ్తే.. బాలుడి తండ్రి పేరు ఓంకార్, మాదకద్రవ్యాలకు బానిసైన అతను తరచు మత్తులోనే ఇంటికి తిరిగి వస్తుండేవాడు. రోజు అతని భార్య పిల్లలను కొట్టేవాడు. ఎప్పటిలాగే ఏప్రిల్ 25 మంగళవారం రోజున కూడా అలాగే జరిగింది.
అయితే తన తండ్రి కొట్టే దెబ్బలకు భయపడిన 12 ఏళ్ల ప్రిన్స్ ఏప్రిల్ 25 రోజున ఇంటి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఏప్రిల్ 26 వరకు ప్రిన్స్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లి పరిసరాల్లో వెతికింది. అయినప్పటికీ ప్రిన్స్ జాడ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడి ఇంటి నుంచి 1000 మీటర్ల దూరంలో ఉన్న మకరంద్నగర్ పవర్ హౌస్ సమీపంలో అతని మృతదేహం పడి ఉండడం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆ మృతదేహం తన కుమారుడు ప్రిన్స్దేనని గుర్తించారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడిని వీధికుక్కలు చంపినట్లు తెలుస్తోంది. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.