120 కేజీల గంజాయి స్వాధీనం

120 కేజీల గంజాయి స్వాధీనం
  • భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ డాక్టర్​ వినీత్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 120 కేజీల గంజాయిని స్వాధీనం  చేసుకున్నట్లు భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ డాక్టర్​ వినీత్​ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్​ స్టేషన్​లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. గతనెల 28న ఓ వెహికల్​లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో టేకులపల్లి ఎస్సై రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి స్టేషన్​ ఎదుట రోడ్డుపై నిఘా పెట్టారు. 

వెహికల్స్​ చెక్​ చేస్తుండగా గంజాయి ఉన్న వెహికల్​ను సమీపంలోని పెట్రోల్​ బంక్​ వద్ద డ్రైవర్​ వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి వెహికల్​ అక్కడే ఉండడం, ఎవరూ రాకపోవడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల ట్రక్​ను తెరిచి చూశారు. అందులో మూడు ఇనుప బీరువాలు ఉన్నట్టుగా గుర్తించారు. రెండు బీరువాలు తెరిచి చూడగా ఖాళీగా ఉన్నాయి. వాటి వెనుక ఉన్న మరో బీరువాను తెరిచి చూడగా రూ. 30లక్షల విలువైన120కేజీల గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. 

వెహికల్​నంబర్​ఆధారంగా విచారించగా కర్నాటక రాష్ట్రం బీదర్​కు చెందిన మహ్మద్​ షకీల్​కు చెందిన వాహనంగా గుర్తించారు. కొద్ది రోజుల కిందట తనకు తెలిసిన డ్రైవర్​మజార్​ అనే వ్యక్తికి వెహికల్​ను కిరాయికి ఇచ్చినట్టుగా యజమాని తెలిపారు. పరారీలో ఉన్న డ్రైవర్​ మజార్​కోసం వెతుకుతున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.