టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత గాయని ప్రదర్శన

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత గాయని ప్రదర్శన

టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్‌ పై టీమిండియా ఓడిపోయినప్పటికి ఈ టోర్నీలో భారత్ ప్రతిభ అంతటితో ఆగిపోలేదు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత స్వరం ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ అమ్మాయి జానకి ఈశ్వర్ ఫైనల్‌ మ్యాచ్ లో ప్రదర్శన ఇవ్వనుంది. ‘ది వాయిస్’ అనే రియాలిటీ షో నుంచి జానకి ఈశ్వర్ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఫేమస్ అయింది. 13 ఏళ్ల ఈ టీనేజ్​ అమ్మాయి ఆస్ట్రేలియన్ రాక్ గ్రూప్ ఐస్‌హౌస్‌తో కలిసి ప్రదర్శన ఇవ్వనుంది. “ఐస్‌హౌస్ వి కెన్ గెట్ టు గెదర్” సమయంలో జానకి ప్రదర్శన ఉండబోతుంది.

వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్ లో  తనకు ఈ అవకాశం రావడం  సంతోషంగా ఉందని జానకి ఈశ్వర్ వెల్లడించింది. భారత్ ఫైనల్ ఆడితే మరింత బాగుండేదని అభిప్రాయపడింది. జానకి తల్లిదండ్రులు, అనూప్ దివాకరన్, దివ్య రవీంద్రన్ కేరళలోని కోజికోడ్‌కు చెందినవారు. గత 15 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. జానకి తల్లిదండ్రులు ముందుగా ఆమెకు భారతీయ సంగీతాన్ని నేర్పించారు. ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకుంది. ఇక టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ ఓడించగా,  ఇంగ్లండ్ భారత్‌ను చిత్తు చేసింది.